నర్సాపూర్, ఏప్రిల్ 22: ప్రయాణికురాలి నుంచి పుస్తెలతాడును దొంగలించడానికి ప్రయత్నించిన ఓ ఆటోడ్రైవర్ను పట్టుకొని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని ఆవంచ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఊరడి సురేశ్ భార్య స్వప్నతో కలిసి ఆటోలో సంగారెడ్డి నుంచి నర్సాపూర్ వైపు వస్తున్నాడు.
సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ఖాన్పేట్కు చెందిన అమృత ఆ ఆటోలో ఎక్కింది. నర్సాపూర్ మండలంలోని ఆవంచ గ్రామ సమీపంలోకి రాగానే ఊరడి సురేశ్ ఆటోను రోడ్డు పక్కకు నిలిపి అమృతను కత్తితో బెదిరించి పుస్తెల తాడును లాక్కున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి దీన్ని గమనించి తన కాన్వాయ్ని ఆపి నిందితుడిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. బాధితురాలికి పుస్తెలతాడును ఇప్పించారు. సునీతాలక్ష్మా రెడ్డికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.