హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆటో కార్మికుల (Auto workers ) పొట్టకొట్టిందని ఆరోపిస్తూ తెలంగాణలోని పలు జిల్లాలో ఆటో కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ఆర్టీసీ బస్(RTC Bus) లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తాము రోడ్డున పడుతున్నామని పేర్కొంటూ సిద్దిపేట జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలోని రాయికల్ పట్టణం, కొడిమ్యాల మండల కేంద్రం, మెదక్ జిల్లా రామయంపేట, వేములవాడలో ఆటో కార్మికులు ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మహాలక్ష్మి పథకం (Maha Laxmi) ద్వారా ఉచిత ప్రయాణం వల్ల తమకు ఉపాధి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని ఆటోలను నడిపిస్తున్నామని, ప్రభుత్వ విధానం వల్ల పూట గడవని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వైపు ఆటో ఈఎంఐలు, మరో వైపు కుటుంబ పోషణ భారంగా మారుతుందని అన్నారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు వందలాదిగా ఆటోలతో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందించారు.
సిద్దిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు పాల సాయిరాం మాట్లాడుతూ మూడు రంగుల జెండా పార్టీ మూడు చక్రాల ఆటో కార్మికుల జీవితాల్లో చీకటి నింపిందన్నారు. లక్షలాది ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడనీ ఆటో కార్మికుల జీవితాల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల జీవితాలు చిగురించాలంటే ప్రభుత్వం నెలకు రూ.15 వేలు జీవనభృతి కింద చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటో లేని సమాజాన్ని ఊహించలేమని, ఆటో కార్మికుల సామాజిక, ఆర్థిక భద్రతను పరిగణించాలన్నారు.