గోదావరిఖని, డిసెంబర్ 26: ‘తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నది. సంస్థ జోలికి వస్తే ఊరుకోం. వెంటనే కేకే5, పెనుగడప, శ్రావణపల్లి, సత్తుపల్లి బ్లాకుల వేలాన్ని నిలిపేయాలి. లేదంటే మరో పోరాటం తప్పదు’ అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సింగరేణి పోరు దీక్ష చేపట్టారు. అంతకుముందు ప్రధాన చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. కాగా, జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఎమ్మెల్యేకు పూలమాల వేసి దీక్షను ప్రారంభిపజేశారు. అనంతరం కోరుకంటి మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్థిక, సామాజిక జీవనాడి సింగరేణి సంస్థ అని పేర్కొన్నారు. అద్భుతమైన అభివృద్ధి ప్రస్థానం సాగిస్తూ లాభాల్లో నడుస్తున్నదని చెప్పారు. అలాంటి మణిహారాన్ని నష్టాలు చూపించి ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం యత్నిస్తున్నదని మండిపడ్డారు. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకు బొగ్గు బ్లాకుల వేలానికి మోదీ సర్కారు సిద్ధమైందని ధ్వజమెత్తారు.
సింగరేణిని కాపాడుకునేందుకు మరో పోరాటానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. బొగ్గు బ్లాకులను వేలం వేయొద్దని, ప్రభుత్వానికే కేటాయించాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా పెడచెవిన పెట్టిందన్నారు. రాజస్థాన్లో లిగ్నైట్ గనులు, చత్తీస్గఢ్, జార్ఖండ్లో ఉన్న గనులను ఆయా ప్రభుత్వాలకే కేటాయించిన కేంద్రం.. తెలంగాణలో ఉన్న బ్లాకులకు ప్రభుత్వానికి ఎందుకు కేటాయించట్లేదని ప్రశ్నించారు. డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, జెడ్పీటీసీ ఆముల నారాయణ, టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మూల విజయారెడ్డి, కార్పొరేటర్లు తదితరులు దీక్షలో పాల్గొన్నారు.