నమస్తే తెలంగాణ నెట్వర్క్: తెలంగాణ శాసనసభకు జరిగిన పోలింగ్ మొత్తంగా ప్రశాంతంగా జరిగినా కొన్నిచోట్ల మాత్రం చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. చాలాచోట్ల కాంగ్రెస్ పార్టీ రౌడీయిజానికి పాల్పడింది. అధికార పార్టీ అభ్యర్థులపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. వాహనాలను ధ్వంసం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద నానా రభస చేశారు. కొన్ని చోట్ల రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనల్లో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.
స్థానిక బీఎంఎస్ కార్యాలయం సమీపంలోని 90వ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు విసురుకున్నారు. వారిని చెదరగొట్టే క్రమంలో కరీంనగర్ విజలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్ఐ గంగన్న, కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లిలో పోలింగ్ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోఖానాపూర్ నియోజకవర్గంలోని ఎంగ్లాపూర్, బెల్లంపల్లి నియోజకవర్గంలోని వరిపేట వాసులు పోలింగ్కు దూరంగా ఉన్నారు. అధికారులు వచ్చి సర్దిచెప్పడంతో ఈ రెండు గ్రామాల్లో మధ్యా హ్నం 2 గంటల తర్వాత ఓట్లు వేశారు. బోథ్ నియోజకవర్గం భీంపూర్ మండలం గొల్లగఢ్తాంసి గ్రామస్థులు కూడా పోలింగ్ను బహిష్కరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో డీసీసీబీ చైర్మన్, నియోజకవర్గ పోలింగ్ ఏజెంట్ గొంగిడి మహేందర్రెడ్డి కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడించి రాళ్లతో దాడిచేశారు. హనుమకొండ రాంనగర్లోని కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ కార్యాలయంపై రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఉదయభాస్కర్ దాడి చేసి ఆయన డ్రైవర్ను చితకబాదారు. వరంగల్లోని పెరుకవాడలో సాయంత్రం 5 గంటలకు ఒక్కసారిగా ఓటు వేయడానికి ప్రజలు తరలిరావడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. జనగామలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం ఒక్కటై బీఆర్ఎస్ కార్యకర్తలపై దాష్టీకానికి పాల్పడ్డాయి. ప్రెస్టన్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
జనగామ రైల్వేస్టేషన్ సమీపంలోని పోలింగ్బూత్ వద్ద కూడా కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నాయకులు ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను చొక్కా పట్టుకొని ఆవరణలోకి లాక్కెళ్లి పిడిగుద్దులు కురిపించారు. ఆ తర్వాత కూడా జనగామలో ఉద్రిక్తత నెలకొంది. నర్సంపేట రోడ్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్, కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ వాహనాలు ఎదురుపడ్డాయి. కారుదిగి వచ్చిన సురేఖ.. నరేందర్ను అంతుచూస్తానని బెదిరించడంతో ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లో బీఆర్ఎస్ నాయకుడిపై కత్తితో దాడి చేశారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల తలలు పగులగొట్టారు. మక్తల్ నియోజకవర్గంలోని వర్కూరులో బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డిపై దాడికి యత్నించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి ఒకరు మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని 248 నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధుల కోసం వచ్చిన సుధాకర్(48) అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఛాతీనొప్పితో బాధపడగా వెంటనే ఆయనను పటాన్చెరు ఏరియా దవాఖానకు తరలించారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్కు చెందిన చంద్రగిరి రాజన్న(65) స్థానిక బాలికల పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డాడు. అకస్మాత్తుగా కింద పడిపోవడంతో స్థానికులు, సిబ్బంది చికిత్స కోసం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మావల గ్రామానికి చెందిన తోకల గంగమ్మ(76) ఓటు వేయడానికి మావల ప్రభుత్వ పాఠశాలకు రాగా అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చింది. అక్కడ ఉన్న సిబ్బంది చికిత్స కోసం రిమ్స్కు తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రవీకరించారు.
కన్నతండ్రి మృతి చెందినప్పటికీ బాధ్యతను విస్మరించకుండా ఓటు హక్కును వినియోగించుకున్న ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని ఆవంచ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జక్కుల రాములు గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయినప్పటికీ రాములు కుమారుడు ప్రశాంత్, ఆయన సోదరుడు శ్రీనివాస పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.