ఊట్కూర్, జూలై 18 : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ఇసుక మాఫి యా రెచ్చిపోతున్నది. ప్రభుత్వ అనుమతుల పేరిట ఆన్లైన్ ఇసుక రవాణాను కాస్తా.. అక్ర మ రవాణాగా మార్చి రూ.కోట్లలో అక్రమ దందాకు తెరలేపారు. కృష్ణ మండలం వాసునగర్ శివారులోని కృష్ణానదిలో హిటాచీలతో భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు చేపట్టినా సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు నెలకొన్నాయి. శనివారం మధ్యాహ్నం కృష్ణ మండ లం వాసునగర్ సమీపంలో కృష్ణానదిలో ఇసు క అక్రమంగా తరలిపోతున్నదన్న విషయాన్ని తెలుసుకుని న్యూస్ కవరేజీకి వెళ్లిన ‘నమస్తే తెలంగాణ’ మాగనూరు రిపోర్టర్ రాము, ఫొటోగ్రాఫర్ తాహర్అలీని ఇసుక మాఫియా అడ్డుకుని భౌతిక దాడులకు దిగడంతోపాటు నది సమీపంలోకి వస్తే చంపేస్తామని బెదిరించింది. గూడెబల్లూరుకు చెందిన అధికార పార్టీ నేత నారాయణతోపాటు ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని బాధిత జర్నలిస్టులు కృష్ణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మక్తల్ దవాఖానలో రాము చికిత్స పొందుతున్నాడు. రిపోర్టర్ రాము, ఫొటోగ్రాఫర్ తాహర్పై జరిగిన దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ విషయం ఎస్పీ వినీత్, మక్తల్ సీఐ రామ్లాల్ దృష్టికి తీసుకెళ్లినట్టు సంఘాల ప్రతినిధులు తెలిపారు.