హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఒక దీపంతో అనేక దీపాలను వెలిగించినట్టు.. ఒక వ్యక్తి అవయవ దానంతో కనీసం 40 మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జీవన్దాన్ కో ఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత చెప్పారు. యశోద దవాఖాన వైద్యులు అధిక సంఖ్యలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి ఎంతో మంది రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించారని తెలిపారు. ఏప్రిల్ నెలను ‘నేషనల్ డొనేట్ లైఫ్’గా పరిగణిస్తున్న నేపథ్యంలో, అవయవ మార్పిడి చేయించుకొని కొత్త జీవితాన్ని పొందినవారితో శుక్రవారం సికింద్రాబాద్ యశోద దవాఖానలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు.
అవసరమైన అవయవాలు లభించక దేశవ్యాప్తంగా ఏటా సుమారు 3 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్టు చెప్పారు. బ్రెయిన్డెడ్కు గురైన వారి నుంచి ప్రస్తుతం అవయవ దానం రేటు 0.36గా ఉన్నదని, ఇది ఒక శాతానికి చేరుకున్నా రెట్టింపు సంఖ్యలో వ్యాధిగ్రస్తుల ప్రాణాలు నిలుస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అవయవ దానం ఆశాజనకంగానే ఉన్నదని, దేశంలోనే అత్యధికంగా ప్రతి 10 లక్షల జనాభాకు ఐదుగురు అవయవ దానం చేస్తున్నారని ఆమె తెలిపారు.
ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్గా హైదరాబాద్
రాష్ట్రంలో అవయవదానాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని, హైదరాబాద్ దేశంలోనే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్గా నిలువనున్నదని డాక్టర్ స్వర్ణలత చెప్పారు. అవయవ దానాలు పెంచడమే కాకుండా అవయవ దానంపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. ఇటీవల చాలా మంది రోగులు చివరిదశలో ఊపిరితిత్తుల వ్యాధి లేదా టెర్మినల్ హార్ట్ ఫెయిల్యూర్తో యశోదతోపాటు వివిధ దవాఖానల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నట్టు తెలిపారు. కొన్నేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం, జీవన్దాన్ నేతృత్వంలో దేశంలోనే అత్యధిక అవయవ దానం, అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు హైదరాబాద్లో జరుగుతున్నట్టు చెప్పారు.
అయినా, ఇంకా చాలా మంది ఆర్గాన్స్ కోసం నిరీక్షిస్తున్నారని తెలిపారు. యశోదలో ఇప్పటివరకు 300 వరకు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్టు చెప్పారు. అందులో గుండె మార్పిడి శస్త్రచికిత్సలు 100, ఊపిరితిత్తుల మార్పిడుల 150, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు 50 వరకు ఉన్నట్టు వివరించారు. యశోద దవాఖానలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న పలువురు రోగులు మార్పిడికి ముందు, తరువాత అనుభవాలను ఈ సందర్భంగా వెల్లడించారు.