వరంగల్, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ జాతరలో ‘జై తెలంగాణ’ నినాదాలు చేసిన బీఆర్ఎస్ నాయకులపై చేయిచేసుకున్న ఆత్మకూరు ఎస్సై జీ ప్రసాద్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర కిశోర్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జాతరలో జై తెలంగాణ నినాదాలు చేసిన 12 మంది బీఆర్ఎస్ నాయకులను పరకాల ఏసీపీ, ఆత్మకూరు సీఐ, ఎస్సై కలిసి ఈ నెల 24న అర్ధరాత్రి ఇండ్ల నుంచి బలవంతంగా వరంగల్లోని టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించి ఇష్టం వచ్చినట్టు దాడిచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వరంగల్ ఈస్ట్జోన్ డీసీపీ అబ్దుల్ బారీతో విచారణ జరిపించారు. నివేదిక ఆధారంగా తాజాగా ఆత్మకూరు ఎస్సైని సస్పెండ్ చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న సీఐ ఆర్ సంతోష్, పరకాల ఏసీసీ కిశోర్కుమార్ పాత్రపై నివేదికలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ మొత్తం ఘటనలో ఎస్సైని మాత్రమే బాధ్యుడిని చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడిచేసిన ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ బుధవారం ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని తలపెట్టింది. తాజాగా ఎస్సైని సస్పెండ్ చేయడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. ఎస్సైపై చర్యలతో సరిపెట్టడం కాదని, బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అగ్రంపహాడ్ జాతరలో సమ్మక్మ-సారలమ్మ దర్శనార్థం ఈ నెల 23న మాజీ ఎమ్మెల్యే చల్లా దంపతులు వచ్చారు. అదే సమయంలో ఎమ్మెల్యే రేవూరి దర్శనం చేసుకుంటుండడంతో పోలీసులు గద్దెల గేట్లను మూసివేశారు. ఆ తర్వాత గేట్లు తెరవడంతో చల్లాతోపాటు బీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ తల్లుల దర్శనం చేసుకున్నారు. వారు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించకున్నా అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్తో ఫిర్యాదు చేయించి ఈ నెల 24న అర్ధరాత్రి దాటాక ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు బలవంతంగా స్టేషన్కు తీసుకెళ్లారు. వారిపై 143, 149, 353 వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వరంగల్ టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి ఇష్టంవచ్చినట్టు దాడిచేశారు. దుస్తులు ఊడదీసి, బూతులు తిడుతూ విచక్షణ రహితంగా కొట్టారు. అనంతరం పరకాల పోలీస్ స్టేషన్కు తరలించారు. జరిగిన ఘటనపై వారు చల్లాకు వివరించగా, ఆయన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాధితులతో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఆయన విచారణ జరిపించి బాధ్యుడైన ఆత్మకూరు ఎస్సై ప్రసాద్ను సస్పెండ్ చేశారు.