Telangana DGP | హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్( DGP Anjani Kumar )పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్( BJP MLA Raghunandan ) చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. రఘునందన్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రఘునందన్పై చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి( Speaker Pocharam Srinivas Reddy )కి ఐపీఎస్ అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది.
ఒక శాసనసభ్యుడై ఉండి బాధ్యతారాహిత్యంగా ఒక సీనియర్ ప్రభుత్వ అధికారిపై అన్పార్లమెంటరీ పదజాలం ఉపయోగించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత అనాలోచితం అని పేర్కొంది. అంతేకాకుండా, రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ, ప్రజల భద్రత, భద్రత కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్న తెలంగాణ పోలీసులకు ఇలాంటి జుగుప్పాకరమైన వ్యాఖ్యలు చాలా నిరాశ కలిగించాయని ఐపీఎస్ అధికారుల సంఘం పేర్కొంది.