శేరిలింగంపల్లి, ఆగస్టు 12 : సాంకేతికత పరంగా అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందని రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. అసోసియేషన్ ఆఫ్ గ్రైనకాలజికల్ రోబోటిక్ సర్జన్స్ ఆఫ్ ఇండియా(ఏజీఆర్ఎస్), అపోలో దవాఖానల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్లోని షెరటాన్ హోటల్లో ‘రోబోగైన్ ఇండియా-2023’ రెండురోజుల జాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిదేండ్లలో అత్యాధునిక సాంకేతికతలపై దృష్టి సారించామని, ఇందులో ప్రధానమైంది రోబోటిక్స్ అని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రోబోటిక్స్ పాలసీని ప్రారంభించామని, దేశంలో నిర్దిష్ట రోబోటిక్ పాలసీని కలిగి ఉన్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు. ఈ పాలసీలో భాగంగా హెల్త్కేర్, అగ్రికల్చర్, ఇండస్ట్రీయల్ ఆటోమేషన్, కన్జ్యూమర్ రోబోటిక్స్ అనే నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారించామన్నారు. రోబోటిక్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి హెల్త్కేర్ ఓ ప్రధాన రంగంగా ఉందన్నారు. ఇతర దేశాల్లో ఉన్న పురోగతిని అందుకోవడానికి తెలంగాణలో అనేక కోర్సులను ప్రారంభించామన్నారు. టాస్క్ ద్వారా రోబోటిక్స్ ప్రోగ్రామ్స్ ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామన్నారు.
రెండేండ్లలో రోబోటిక్స్లో ప్రాథమిక లేదా అడ్వాన్స్ కోర్సుతో పదివేల మంది విద్యార్థులు కలిగి ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో స్టార్టప్ యాక్టివిటీని ప్రోత్సహించేందుకు రోబోటిక్ యాక్సులరేటర్ ప్రోగ్రామ్స్పై దృష్టి సారించామన్నారు. అపోలో హాస్పిటల్స్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ.. 2011లోనే రోబోటిక్స్ ప్రాధాన్యతను గుర్తించామని, అపోలో హాస్పిటల్స్లో ఇప్పటికే 12వేల రోబోటిక్స్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ రూమాసిన్హా, ఉపాధ్యక్షుడు డాక్టర్ రామజోషి, ఏఏజీఎల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఆర్నాల్డ్ పీ అడ్విన్కులా, ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ డాక్టర్ టోని చల్హౌబ్, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ చీఫ్ డాక్టర్ జోసెఫ్లతోపాటు దాదాపు 150 మంది గైనకాలజీ విభాగానికి చెందిన డాక్టర్లు పాల్గొన్నారు.