హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): జమ్ముకశ్మీర్లో మాదిరిగా తెలుగు రాష్ర్టాల్లోనూ అసెంబ్లీ సీట్లు పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ సీట్లను పెంచుతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్నదని, ఆ ప్రక్రియ పూర్తికాగానే అక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని శనివారం శ్రీనగర్లో పర్యటన సందర్భంగా అమిత్షా చెప్పారని వినోద్కుమార్ తెలిపారు. ఆ రాష్ట్రంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ నియోజకవర్గాల పునర్విభజన జరపాలని వినోద్కుమార్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సీట్లను పెంచుతామని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనూ కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తుచేస్తూ.. ఒకే దేశం-ఒకే చట్టం విధానాన్ని తెలుగు రాష్ట్రాలకూ వర్తింపజేయాలని కోరారు. తెలంగాణ, ఏపీలో వెంటనే అసెంబ్లీ సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు.