నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 14: ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ర్టాల నుంచి వేలమంది పుట్టిన ఊరును, కన్నవాళ్లను వదిలి, పొట్టచేతపట్టుకొని పెళ్లాంపిల్లలతో బతుకుదెరువు కోసం ఏటా రైళ్లు, బస్సులు ఎక్కుతున్నారు. వారందరికీ కనిపిస్తున్న ఆశాదీపం తెలంగాణ. బీజేపీ పాలిత రాష్ర్టాల నుంచి ఆకలితో డొక్కలెండి వస్తున్న కూలీలకు తెలంగాణ కడుపు నింపుతున్నది. కండ్లల్లో పెట్టుకొని కాపాడుతున్నది. ఆ జిల్లా.. ఈ జిల్లా అన్న తేడా లేదు. తెలంగాణలో ఏ జిల్లాకు వెళ్లినా.. బీహారీ హమాలీలు కనిపిస్తారు. పత్తి చేలల్లో ఉత్తరప్రదేశ్ కుటుంబాలు తెల్లబంగారం ఏరుతుంటాయి. వరినాట్లలో మధ్యప్రదేశ్ కూలీలు బిజీగా పనిచేస్తుంటారు. వీరంతా సొంత రాష్ర్టాన్ని, ఉన్న ఊరిని వదిలి ఎందుకు వస్తున్నారు? అక్కడి ప్రభుత్వాలు వీరికి ఉపాధి కల్పించడం లేదా? తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ర్టాల నుంచి పన్నుల రూపంలో ఏటా వేలకోట్లు గుంజుకొంటున్న కేంద్రంలోని మోదీ సర్కారు, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అధిక జనాభా, పేదరికం పేరు చెప్పి కోట్లకు కోట్లు గుమ్మరిస్తున్నది. అక్కడి పాలకులు నోరు తెరిస్తే దేశభక్తి వచనాలు చదువుతుంటారు. మరి ఆ నిధులన్నీ ఏమవుతున్నాయి? పేదల కడుపు నింపని ఆ దేశభక్తి దేనికోసమని వలస కూలీలు ప్రశ్నిస్తున్నారు. తమ రాష్ర్టాల్లో నిత్యం దౌర్జన్యాలు, గూండాయిజాలు, నేతల అవినీతితో విసిగిపోయామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అక్కడ తమ బతుకులు మార్చేవారే లేరని చెప్తున్నారు. రైతులకు ప్రోత్సాహం, కూలీలకు ఉపాధి, యువతకు ఉద్యోగాలు, మహిళలకు స్వయం ఉపాధి వంటి మాటలను తమ పాలకుల నోటినుంచి ఎన్నడూ వినలేదని అంటున్నారు. తెలంగాణలో పుట్టినా బాగుండేదని పేర్కొంటున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కొందరు కూలీలను ‘నమస్తే తెలంగాణ’ పలకరించినప్పుడు.. ఒక్కక్కరిది.. ఒక్కో గాథ. తెలంగాణలో దండిగా పంటలు పండుతున్నాయన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన సురేశ్.. రైతులకు సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి ఇచ్చినట్టే తమ రాష్ట్రంలోనూ ఇస్తే తాము అక్కడే పొలం పనులు చేసుకుని ఉండేవాళ్లమని, ఇక్కడ దాకా వచ్చేవాళ్లం కాదని అంటున్నారు. ఒడిషాకు చెందిన ప్రేమ్కుమార్దీ అదే మాట. ప్రేమ్కుమార్కు సొంతూళ్లో ఎనిమిదెకరాల భూమి ఉన్నది. కానీ.. ఏడాదికి ఒకే పంట పండుతుంది. అదీ వర్షాలు సరిగ్గా కురిస్తేనే.. ‘తెలంగాణ లెక్క ప్రాజెక్టులు, కాలువలు లేవు. వాటిని నిర్మించాలన్న ఆలోచన కూడా మా నాయకులకు వస్తలేదు. తెలంగాణ లెక్క మా రాష్ట్రంలో నీళ్లుంటే ఇక్కడికి వలస వచ్చేటోన్నిగాదు. అక్కడ రోజంతా పనిచేసినా రూ.200 దొరుకవు. ఇక్కడ వెయ్యి, 1500 సంపాదిస్తున్నా. మా రాష్ట్రం కూడా తెలంగాణ లెక్క కావాలంటే కేసీఆర్ లాంటి సీఎం కావాలి’ అని ప్రేమ్ కుమార్ చెప్పాడు. వీరిద్దరేకాదు.. చాలా మందిది ఇదే ఆవేదన.. ఇదే ఆకాంక్ష.
తెలంగాణలో సాగు విధానాలను చూసి యూపీ ప్రభుత్వం నేర్చుకోవాలి. ఇక్కడి రైతులు చాలా అదృష్టవంతులు. ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం అందుతున్నది. మమ్నల్ని యూపీలో పట్టించుకొనేవారు లేరు. సర్కారు పెద్దలకు కూడా వ్యవసాయం అంటే చిన్నచూపు. చాలామంది భూములు పడావు పెట్టి, వేరే పనులు చేసుకొంటున్నారు. తెలంగాణనే లేకపోతే మేం ఉపాధి లేక రోడ్డున పడేటోళ్లం.
–సుబిదాన్, పిలిపిట్ జిల్లా, ఉత్తరప్రదేశ్
30 మంది కూలీలం మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చాం. ఇక్కడి రైతులు కేసీఆర్ సార్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. పొలాలకు నీళ్లు తెచ్చారని, నీళ్లకు ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఏటా రెండుసార్లు పంట పెట్టుబడి ఇస్తున్నారట. ఇట్ల ఉంటే రైతుకు ఇంకేం కావాలి? చేతినిండా పనిదొరుకుతున్నది. కడుపు నిండుతున్నది. కుటుంబంతో సహా వచ్చాం. రైతన్నకు ఇంత మంచి చేసిన కేసీఆర్ సాబ్కు జై.
–సుగ్రీవ్కుమార్, గుంపు మేస్త్రీ, దేండోరి జిల్లా, మధ్యప్రదేశ్
మాది పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా గొసాబా. మా రాష్ట్రంలో పనులు లేవు. ఉపాధికోసం నిజామాబాద్, మెదక్, కరీంనగర్కు వానకాలం, యాసంగి సీజన్లలో నాట్లు వేసేందుకు వస్తాం. తిండి, వసతి ఖర్చులు లేకుండా పనిచేసే గ్రామాల్లోనే షెల్టర్ వెతుక్కుంటున్నం. ఒక్కొక్కరం రోజుకు రూ.1,000 దాకా సంపాదిస్తాం. దాదాపుగా 50 రోజులపాటు పనులు చేసి తిరిగివెళ్తాం.
–బబాతోష్, గొసాబా, పశ్చిమ బెంగాల్
మా రాష్ట్రం ఛత్తీస్గఢ్లో సరైన ఉపాధి అవకాశాలు లేవు. ఏడాదిలో ఒక సీజన్ పని దొరకదు. సాగు అంతంత మాత్రమే. అందుకే మేమంతా తెలంగాణకు వస్తున్నాం. ఇక్కడ మాకు కూలీ గిట్టుబాటు అవుతున్నది. ఇక్కడి రైతులు కూలీలను బాగా చూసుకొంటున్నారు. ఏడాదిలో మూడు నెలలు ఇక్కడే ఉంటాం. భద్రాద్రి జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేసి తిరిగి మా స్వస్థలానికి వెళ్తాం.
–నూపా భీమి, దంతేవాడ, ఛత్తీస్గఢ్
మాది మహారాష్ట్రలోని చంద్రాపూర్. మా రాష్ట్రంలో పనులు దొరకవు. తెలంగాణలో పంటలు బాగా పండుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు ఏటా వచ్చి జిన్నింగ్ మిల్లులో పనిచేస్తా. ఆరేడు నెలలపాటు ఇక్కడే ఉంటా. వారానికోసారి సేటు రూ.3 వేలు ఇస్తరు. నా ఖర్చులకు ఉంచుకొని మిగిలినవి ఇంటికి పంపిస్తా. సీఎం కేసీఆర్ సారు సల్లంగుండాలె. ఇలాగే పనిదొరకాలి.
–సంజీవ్, మహారాష్ట్ర
తెలంగాణలో మాకు రోజూ చేతినిండా పని లభిస్తున్నది. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలోని రైస్ మిల్లులు, ట్రేడర్స్ దగ్గర పనిచేస్తున్నాం. రోజుకు రూ.1,000 వరకు సంపాదిస్తాం. మా స్వంత గ్రామంలో పని లేక ఇంతదూరం వచ్చినం. లాక్డౌన్లో తెలంగాణ ప్రభుత్వం మాకు బియ్యం, డబ్బులు ఇచ్చింది. సీఎం కేసీఆర్ పాలనలో ఇక్కడ చక్కగా పని చేసుకోగలుగుతున్నాము.
–రానేష్సిర్హా, బీహార్
మా రాష్ట్రంలో తాపీ మేస్త్రీకి రోజూ పని ఉండదు. దొరికినా రోజుకు రూ.200 నుంచి రూ.400 మాత్రమే వస్తాయి. నేను భార్యాపిల్లలతో కలిసి రెండేండ్ల్లుగా తెలంగాణలోనే పనిచేస్తున్న. మా రాష్ట్రంలో చౌహాన్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతలేవు. మా సొంత ఊళ్లకు వెళ్లినప్పుడు తెలంగాణ రాష్ట్ర విశేషాలు మా బంధువులు ఆసక్తిగా అడిగుతుంటారు.
–మానిజ్, తాపీ మేస్త్రి, బాలాగఢ్ జిల్లా, మధ్యప్రదేశ్
తెలంగాణలో ఉపాధికి కొదవ లేదు. మహారాష్ట్ర నుంచి వచ్చాం. రెండు నెలలు ఇక్కడ పని చేసుకుంటాం. రోజుకు ఖర్చులు పోను 500 రూపాయలు సంపాదిస్తాం. ఏటా జనవరిలో వస్తాం. మార్చి నెలాఖరు దాకా ఉంటాం. పూర్తిగా మిర్చి తోటలు అయిపోయిన తర్వాత వెళ్లిపోతాం. రైతులు స్వయంగా వాహనాలు పంపించి పనులకు తీసుకొస్తారు. మాకు భోజనానికి బియ్యం, ఉండటానికి ఇండ్లు, తాగునీరు, వైద్య సౌకర్యం, వసతులు
కల్పిస్తారు.
–మనోజ్ నరూటే, మహారాష్ట్ర
మా మధ్యప్రదేశ్ కంటే తెలంగాణలో పనులు బాగున్నాయి. మా రాష్ట్రంలో కడుపునిండా తినడానికి తిండి కూడా ఉండదు. కూలి పని దొరకదు. అందుకే బతుకుదెరువు కోసం తెలంగాణకు వచ్చాం. అక్కడ రోజు కూలి మేస్త్రీకి రూ.200, లేబర్కు రూ.150. తెలంగాణలో మేస్త్రీకి రూ.800, లేబర్కు రూ.500 ఇస్తున్నారు. రోజూ పని దొరుకుతున్నది. సంతోషంగా చేసుకుంటున్నాం. కడుపు నిండా తింటున్నాం.
–వీకే గణేశ్, బాలాఘాట్ జిల్లా, మధ్యప్రదేశ్
మా రాష్ట్రంలో ఇంతగా సాగు పనులు ఉండవు. మాకూ పొలం ఉన్నది కానీ వసతుల్లేవు. పంట వేయడానికి పైసల్లేక భూములు వదిలేసి వచ్చినం. చేతికొచ్చే పంట అమ్ముకుంటే వచ్చే దేమీ ఉండదు. అంతకంటే తెలంగాణలో నెలన్నర కష్టపడితే సరిపోతుంది.
–బిషూ సర్దార్, గొసాబా, పశ్చిమ బెంగాల్
మాది మధ్యప్రదేశ్. బీజేపీ పాలిస్తున్నది. ఉద్యోగ నోటిఫికేషన్ వేయడంలేదు. నాకు బీఎస్సీ అగ్రికల్చర్లో సీటు వచ్చినా వదిలేసి పనికోసం తెలంగాణకు వచ్చాను. మా అమ్మానాన్న అప్పుచేసి నన్ను చదివించారు. అప్పులు తీర్చేందుకు పనులకోసం వచ్చిన.
–అరవింద్ డోంగ్రే, మధ్యప్రదేశ్
మాది బీహార్లోని నలంద జిల్లా బల్దా గ్రామం. తెలంగాణకు ఎనిమిదేండ్లుగా వస్తున్నా. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ శివార్లలోని వాసవీ రైస్మిల్లులో హమాలీ మేస్త్రీగా పని చేస్తున్నా. రోజూ రూ.700 వరకు వస్తున్నది. ఆనందంగా జీవిస్తున్నాం. బీహార్ నుంచి ఇక్కడికి వచ్చిన 50 మంది నా ద్వారా ఉపాధి పొందుతున్నారు.
–ప్రమోద్, బీహార్
మా రాష్ట్రంలో సరిపడా పనిలేదు. నాలుగు ఎకరాల భూమి ఉన్నా నీళ్లులేక బీడుగా ఉంచాను. నాకున్న రెండు ట్రాక్టర్లను నడుపుకొంటూ ఉపాధి పొందుతున్నా. నాతోపాటు మరో 50 మందిని ఇక్కడికి తీసుకొచ్చి ఉపాధి కల్పించా. కట్ చేసిన చెరుకును నా ట్రాక్టర్తో ఫ్యాక్టరీకి తీసుకెళ్లి కూలీలు, నేను ఉపాధి పొందుతున్నాం.
–పీఎం జాదవ్, కర్ణాటక
మాది పశ్చిమబెంగాల్. అక్కడ ఉపాధి లేదు. రోజంతా కష్టపడితే రూ.400 దొరకయి. పని కూడా రోజూ ఉండదు. తెలంగాణలో పంటలు మస్తు పండుతున్నై. కూలీల అవసరం బాగుందని తెలుసుకొని ఇక్కడికి చాలా మందిమి వచ్చినం. రెండు నెలలుగా నాట్లు వేస్తున్నం. రోజుకూలీ రూ.900 దాకా గిట్టుబాటైతున్నది.
–గోపాల్ సరార్, పశ్చిమబెంగాల్
తెలంగాణలో ఏ రాష్ట్ర కూలీలైనా దర్జాగా బతకొచ్చు. ఎక్కడైనా పని దొరుకుతుంది. ఒడిషా నుంచి వందల కుటుంబాలు ఇక్కడికి వస్తున్నాయి. ఒడిషాలో పనులు సరిగా దొరకవు. గ్రానైట్ పరిశ్రమల గురించి తెలుసుకొని నాలుగేండ్ల క్రితం ఖమ్మం వచ్చా. నాకు ఇక్కడి సర్కార్ రేషన్ కార్డు ఇచ్చింది. ప్రతి నెలా రేషన్ అందుతున్నది.
–మహంతి అరుణ, ఒడిషా