హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణను అగ్నికి ఆహుతి చేద్దామనుకుంటున్నారా? అంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీని ప్రశ్నించారు. ఒక ఉపఎన్నిక కోసం ఇంత బరితెగించాలా? అని నిలదీశారు.
గురువారం ట్విట్టర్ వేదికగా బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీని విమర్శిస్తూ తెలుగులో ట్వీట్ చేశారు. దుకాణాలు, పాఠశాలలు మూయించి, ప్రజలను ఇండ్ల నుంచి బయటకు రాకుండా చేసి, కర్ఫ్యూ సృష్టించాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అల్లా దయతో ఇవన్నీ జరగకూడదని, రాష్ట్ర బీజేపీ సృష్టిస్తున్న హింసకాండ నుంచి విముక్తి పొందాలని ఆశిద్దామంటూ ఓవైసీ ట్వీట్ చేశారు.
మసీదుల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని ముస్లింలకు ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ, పలువురు మతపెద్దలు పిలుపునిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా కొందరు ముస్లిం నాయకులు శుక్రవారం నిరసన చేపడుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండాలంటే ప్రార్థనల అనంతరం అందరూ ప్రశాంతంగా తమ ఇండ్లకు వెళ్లాలని ఒవైసీతోపాటు జమాతే ఉలేమా నాయకుడు మౌలానా హుసాముద్దిన్ సాని జాఫర్ పాషా పిలపునిచ్చారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం నిర్వహించతలపెట్టిన నిరసన ప్రదర్శనలను ఉపసంహరించుకొంటున్నట్టు ముస్లిం మతపెద్ద ముస్తాక్ మాలిక్ ప్రకటించారు.