Minister Harish Rao | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): శిశువు పుట్టగానే క్రిటికల్ కేసులుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకువస్తున్నారు. దీంతో కొంతమంది శిశువులు మార్గమధ్యలోనే మరణిస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కారు హైదరాబాద్లోని నిలోఫర్లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంతో రాష్ట్రంలోని 42 న్యూ బార్న్ బేజీ కేర్ సెంటర్లను అనుసంధానించింది. దీంతో నిలోఫర్ దవాఖానలో ఉన్న నిపుణులైన వైద్యులు వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని వివిధ దవాఖానల్లో అప్పుడే పుట్టిన బిడ్డలకు వైద్య సేవలు అందించే వీలుంటుంది. ఈ సెంటర్తో శిశుమరణాల రేటు గణనీయంగా తగ్గనున్నది.
నిలోఫర్ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ-ఎస్ఎన్సీయూ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను శనివారం హరీశ్రావు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతా మహంతి, సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లలను బతికించుకొనేందుకు, శిశుమరణాల రేటును తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా రూ.2 కోట్ల వ్యయంతో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాష్ట్రమంతటా ‘నిలోఫర్’లాంటి సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలను తగ్గించడంలో తెలంగాణ దేశానికే రోల్మాడల్గా నిలిచిందని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజారోగ్యం గురించి తపిస్తుంటే.. ప్రతిపక్షాలు అనారోగ్య రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
క్రిటికల్ కేసులను నగరానికి తీసుకురావాలంటే చాలా ఇబ్బందిగా ఉందని, ఇందుకోసం త్వరలోనే 33 జిల్లాల్లో 33 నియోనాటల్ అంబులెన్స్లను ప్రారంభిస్తున్నట్టు మంత్రి హరీశ్రావు వెల్లడించారు. వీటికోసం ఏటా రూ. 10 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. గతంలో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అని పాడుకొనేవారని, నేడు ఆ పరిస్థితి రివర్స్ అయ్యిందని తెలిపారు. గతంలో 30 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానలో, 70 శాతం ప్రైవేట్లో జరిగేవని, ఇప్పుడు అందుకు భిన్నంగా 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో, 30 శాతం మాత్రమే ప్రైవేట్లో జరుగుతున్నాయని తెలిపారు. అత్యుత్తమ సేవలతో కార్పొరేట్ దవాఖానలతో ప్రభుత్వ దవాఖానలు పోటీపడుతున్నాయని పేర్కొన్నారు. బిడ్డ కడుపులో పడ్డప్పుడు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్.. బిడ్డ పుట్టాక కేసీఆర్ కిట్ అందజేస్తున్నామని తెలిపారు. ‘ఆరోగ్య లక్ష్మి’తో గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తున్నామని పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన కొంతమంది శిశువులకు గుండెలో రంధ్రాలు పడుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని నిలోఫర్లో ప్రత్యేకంగా గుండె శస్త్రచికిత్సల విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
కొంతమంది తెలంగాణొస్తే ఏమొచ్చిందని అంటున్నారని, వాళ్లు కళ్లుండీ చూడలేని కబోధులని మంత్రి హరీశ్రావు ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడేనాటికి కేవలం ఆరు ఎంసీహెచ్లు మాత్రమే ఉండేవని, వాటిని 28కి పెంచినట్టు తెలిపారు. రాష్ట్రంలో 212 మంది మిడ్వైఫరీ స్టాఫ్ను నియమించి సాధారణ ప్రసవాలు జరిగేలా చూస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో మరో 141 మంది మిడ్వైఫరీ నర్సులను నియమించనున్నట్టు తెలిపారు. తెలంగాణ రాకముందు చిన్నపిల్లలకోసం రాష్ట్రంలో 18 ఎస్ఎన్సీయూలు ఉంటే వాటిని 42కు పెంచుకొన్నట్టు చెప్పారు. వీటిపై ప్రభుత్వం ఏడాదికి రూ. 107 కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. ఎస్ఎన్సీయూల ద్వారా ప్రతి ఏటా 30వేల మంది అప్పుడే పుట్టిన చిన్నారులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నట్టు చెప్పారు.
పాలులేని తల్లుల పిల్లలకోసం నిలోఫర్తోపాటు మరికొన్నిచోట్ల మిల్క్ బ్యాంకులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇలాంటి ప్రయత్నాలతో తక్కువ మాతాశిశు మరణాలు నమోదైన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. రాష్ట్రం వచ్చినప్పుడు ప్రతి లక్షకు 92 మంది తల్లులు మరణించేవారని, ప్రస్తుతం ఆ సంఖ్యను 43కు తగ్గించామని, భారతదేశ సగటు 97 అని వివరించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు శిశుమరణాల రేటు 8గా ఉండేదని, నేడు ఆ సంఖ్యను 21కి తగ్గించి, దేశంలోనే తక్కువ శిశు మరణాలు జరుగుతున్న రాష్ర్టాల్లో 3వ స్థానంలో తెలంగాణ నిలిచిందని వెల్లడించారు. వీటిని మరింత తగ్గించి మొదటిస్థానానికి చేరుకొంటామని వెల్లడించారు. ఇంత చేస్తున్నందుకే మొన్న కేంద్రంలోని నీతి ఆయోగ్ తెలంగాణకు మూడో ర్యాంకు ఇచ్చిందని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ప్రథమస్థానానికి చేరేందుకు కృషిచేస్తామని చెప్పారు.
మా బేబీ పుట్టగానే ఆయాసం, రెస్పిరేటరీ సమస్యతో బాధపడ్డాడు. నిలోఫర్కు తీసుకువచ్చాం. సర్జరీ చేశారు.. కానీ మాకు బాగవుతుందనే నమ్మకం లేకుండే.. కానీ వైద్యులు, సిబ్బంది మా తల్లిదండ్రులకంటే ఎక్కువగా చూసుకున్నరు. 28 రోజులు ఇక్కడి ఎస్ఎన్సీయూలో చికిత్స ఇచ్చారు. మందులు, కూడా ఇక్కడే ఉచితంగా ఇచ్చారు.
-భాస్కర్, శివాణి దంపతులు
మా పాపా ఉమ్మనీరు మింగిందని నిలోఫర్కు పంపారు. 42 రోజులు వెంటిలేటర్పైన పెట్టారు. మొత్తం 58 రోజులు ఇక్కడే ఉన్నాం. బిడ్డ బతుకుతుందనే నమ్మకం లేకుండే. ఇక్కడ అన్ని సౌకర్యాలు, మంచి డాక్టర్లు ఉండడం వల్ల నా బిడ్డ బతికి బట్టకట్టింది.
-విద్యమ్మ, తల్లి
నాకు పెండ్లయిన 15 ఏండ్ల తర్వాత బాబు పుట్టాడు. ఆ 15 ఏండ్లు నరకం అనుభవించా. ఏడు నెలల్లో బాబు పుట్టినా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చినయ్. ఆక్సిజన్ పడిపోయింది. బతకడనుకున్నం. కానీ నిలోఫర్లో చేర్పించి 3 నెలలు చికిత్స అందించారు. నా బిడ్డను బతికించి మా కుటుంబానికే ప్రాణం పోశారు.
-విజయ, తల్లి