హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): విదేశాలను వణికిస్తున్న కరోనా-ఎక్స్ఈ వేరియంట్తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన క్రిటికల్ కేర్ వైద్య నిపుణుడు డాక్టర్ కిరణ్ మాదల స్పష్టం చేశారు. ఎక్స్ఈ వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీ.ఏ.1, బీ.ఏ.2 కలయికే అని తెలిపారు. ఈ రెండు వేరియంట్లు గతంలో మన దగ్గర వ్యాపించటం వల్ల వాటి కలయికతో వస్తున్న ఎక్స్ఈతో ముప్పు ఉండదని వివరించారు. ‘బీ.ఏ.1లో 41 మ్యుటేషన్లు, బీ.ఏ.2లో 49 మ్యుటేషన్లు ఉన్నా.. బీ.ఏ.2 ప్రభావం చూపలేదు. ఎక్స్ఈ వేరియంట్లో 55 మ్యుటేషన్లు ఉన్నాయి. దాని ఫలితంగా వ్యాప్తి రేటు బీ.ఏ.2 కంటే 10 శాతం అధికంగా ఉంటుంది. కానీ దాని వల్ల పెద్ద ప్రమాదం ఉండదు’ అని వెల్లడించారు. ఎక్స్ఈ వేరియంట్ మన దేశంలో వ్యాపించే అవకాశాలు లేవని, ఒకవేళ వాపించినా ఒకటి, రెండు కేసులు నమోదు కావొచ్చని.. అవి కూడా లక్షణాలు లేనివే అవుతాయని తెలిపారు. ఒమిక్రాన్తో సంబంధం లేకుండా కొత్త వేరియంట్ ఏదైనా వస్తే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని ఆయన పేర్కొన్నారు.