హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ, పీజీలో ఆర్ట్స్ కోర్సుల ఆధిపత్యం కొనసాగుతున్నది. ఐదేండ్లుగా ఉన్నత విద్యలో ఇదే పరిస్థితి కనపడుతున్నది. జాతీయంగా అంతటా ఇదే వాతావరణం నెలకొన్నది. డిగ్రీలో బీఏ, పీజీలో ఎంఏ ఆర్ట్స్ కోర్సులే టాప్లో నిలిచాయి. ఈ రెండు కోర్సుల్లో ఏటా అడ్మిషన్ల సంఖ్యలో గణనీయంగా మార్పులొచ్చాయి. బీఏ కోర్సులో మూడేండ్లుగా అడ్మిషన్లు తగ్గగా, 2020 -21లో మాత్రం గణనీయంగా పెరిగాయి.
2016-17లో అడ్మిషన్ల సంఖ్య 80.71 లక్షలు కాగా, 2020 -21కి వచ్చేసరికి 85.35 లక్షలకు చేరుకొన్నదని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (అయిషే) నివేదిక వెల్లడించింది. సాంకేతిక విద్యలో అత్యున్నత కోర్సు అయిన బీటెక్లో అడ్మిషన్లు ఏటా తగ్గుతున్నాయి. ఐదేండ్ల వ్యవధిలో 4 లక్షలకు పైగా అడ్మిషన్లు తగ్గాయి. డిగ్రీ బీఎస్సీలో 3 లక్షలు, బీకాంలో 3 లక్షలు, బీఈడీలో ఏకంగా 6 లక్షల విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఎంటెక్ కోర్సులో ప్రవేశాల సంఖ్య ఏటా తగ్గుతున్నది. ఐదేండ్ల వ్యవధిలో 22వేల మంది విద్యార్థులే చేరారు.