హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభంలో చిక్కుకొన్న శరణార్థులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ మానవీయ కోణంలో అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టింది. భారత్ సహా ఇతర దేశాలకు చెందిన శరణార్థులకు వసతి, భోజనం ఇతర సేవలు అందిస్తున్నది. పోలాండ్, హంగేరీ, రొమేనియా, స్లోవెకియా, బల్గేరియా వెళ్లేవారికోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ శరణార్థి శిబిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్కు చెందిన 27 మంది టీచర్లు, 72 మంది కార్యకర్తలతోపాటు ఐరోపా దేశాల నుంచి వచ్చిన సంస్థ ప్రతినిధులు 40 మంది సహాయక చర్యల్లో తలమునకలయ్యారు. ఇప్పటివరకు 4,122 మంది శరణార్థులకు ఆశ్రయం కల్పించినట్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రకటించింది. తాము ఏర్పాటుచేసిన హెల్ప్లైన్ ద్వారా 7,668 ఫోన్ కాల్స్ స్వీకరించామని, 6 వేల మెడిసిన్ కిట్లు, దాదాపు 4 వేల భోజనాలు పంపిణీ చేశామని ఆ సంస్థ వెల్లడించింది.