NIMS | ఖైరతాబాద్ (హైదరాబాద్), మే 25: శరీరానికి చిన్న గాయమైతేనే తట్టుకోలేకపోతాం.. అలాంటిది గుండె, ఊపిరితిత్తుల మధ్య బాణం ఇరుక్కుపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది.. కానీ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాకు చెందిన గొత్తి కోయ యువకుడు అస్సలు భయపడలేదు. ఆరు రోజులుగా శరీరంలోని బాణంతో పలు దవాఖానలు తిరిగినా ప్రయోజనం లేక చివరికి హైదరాబాద్ నిమ్స్కు రాగా వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు.
అసలు ఏం జరిగిందంటే..
బీజాపూర్ జిల్లాలోని ధర్మారం గ్రామానికి చెందిన సోది నంద అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి సోమవారం అడవిలో వేటకెళ్లాడు. పొదల్లో ఉన్న అడవి పందిని చంపడానికి నంద స్నేహితుడు బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ సమయంలో నంద అడవిపంది ఉన్న వైపు నిల్చొని ఉన్నాడు. అయితే స్నేహితుడు వదిలిన బాణం గురితప్పి నంద గుండెలోకి దూసుకెళ్లింది. గుండె, ఊపిరితిత్తుల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో తొలుత భద్రాచలం ఏరియా దవాఖానకు, తర్వాత వరంగల్లోని ఎంజీఎంకు తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. చివరికి కుటుంబసభ్యులు హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకొచ్చారు. కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వరరావు, గుండె వైద్య నిపుణులు డాక్టర్ గోపాల్ పరిశీలించారు. విజయవంతంగా శస్త్రచికిత్స చేసి బాణాన్ని తొలగించారు.
ఈ సందర్భంగా అమరేశ్వర రావు మాట్లాడుతూ ‘అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన ఉండటంతో అర్ధరాత్రి అనస్తీషియా, గుండె, ఇతర సర్జరీ విభాగాలకు చెందిన వైద్యులను పిలిపించి శస్త్రచికిత్సను ప్రారంభించాం. 4 గంటల పాటు శ్రమించి గుండెకు ఉన్న గాయానికి చికిత్స చేస్తూ, ఊపిరితిత్తులకు పడిన రంధ్రాన్ని పూడ్చి అందు లో నిండిన రక్తాన్ని పూర్తిగా తొలగించాం. నంద ప్రస్తతం కోలుకుంటున్నాడు’ అని తెలిపారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప స్పందిస్తూ ‘బాధితుడు ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి చెందినవాడు కావడంతో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. స్పెషల్ కేసుగా పరిగణించి చికిత్సను ఉచితంగా అందిం చాం. ఈ ఆపరేషన్ను చాలెంజ్గా తీసుకొని రోగి ప్రాణాలను కాపాడిన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ అమరేశ్వర రావు బృందానికి అభినందనలు’ అని పేర్కొన్నారు.