మారేడ్పల్లి/హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో నకిలీ ఎస్సైగా చెలామణి అవుతున్న ఓ యువతిని రైల్వే పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సలీమా వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి ప్రాంతానికి చెందిన జడల మాళవిక (25) హైదరాబాద్ నిజాం కళాశాలలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎఫ్లో ఎస్సై పోస్టుకు పరీక్ష రాసింది. ఆమెకు మెల్ల కన్ను ఉండటంతో వైద్య పరీక్షల్లో ఫెయిలైంది. దీంతో ఆమెను ఎస్సై ఉద్యోగానికి అనర్హురాలని ప్రకటించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆర్పీఎఫ్ నకిలీ ఎస్సై అవతారం ఎత్తింది. ఎల్బీనగర్లో పోలీసు డ్రెస్ కుట్టించుకున్నది. కొత్తపేటలో రైల్వే పోలీసు అధికారి ఐడీ కార్డును తయారు చేయించుకొని ఎస్సైగా చెలామణి అవుతున్నది.
ఇటీవల మాళవిక తల్లిదండ్రులు పెండ్లి సంబంధం చూడగా.. ఆమె పెండ్లి చూపులకు కూడా యూనిఫాంలో వెళ్లింది. శంకర్పల్లిలో ఉద్యోగం చేస్తున్నానని అబ్బాయి కుటుంబసభ్యులకు తెలిపింది. అబ్బాయి తరఫువారికి అనుమానం వచ్చి మాళవిక గురించి ఆరా తీయగా.. ఆమె నకిలీ ఎస్సై అని తేలింది. సమాచారం మేరకు రైల్వే పోలీసులు మాళవికను నల్లగొండ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు.