పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్ 10 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకు గణనీయంగా తగ్గుతున్నది. దీంతో అవసరమైన నీటిని మోటర్ల ద్వారా ఎత్తిపోసి నల్లగొండ జిల్లాతోపాటు జంటనగరాల తాగునీటి అవసరాలకోసం తరలించేందుకు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు చర్యలు చేపట్టింది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పుట్టంగండి జీరో పాయింట్ వద్ద రూ.3 కోట్లతో పనులు చేపట్టింది. 600 హెచ్పీ సామర్థ్యం గల 5 మోటర్లు, 300 హెచ్పీ సామర్థ్యం కలిగిన మరో ఐదు మోటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.ఇప్పటికే విద్యుత్తులైన్ పనులు పూర్తి కాగా, జీరో పాయింట్ వద్ద ఉన్న షెడ్లో మోటర్లు బిగిస్తున్నారు. వీటి ద్వారా సాగర్ వెనుక జలాల నుంచి రోజు కు 900 క్యూసెక్కులను పుట్టంగండి అప్రోచ్ కెనాల్లోకి ఎత్తిపోయనున్నారు. మొన్నటి వరకు సాగర్ప్రాజెక్టు నీటిమట్టం 512 అడుగుల వరకు ఉండటంతో మోటర్ల ఏర్పాటు సాధ్యం కాలేదు. ప్రస్తుతం నీటిమట్టం 510 అడుగులకు తగ్గడంతో పనులు వేగవంతం చేశారు. 2016, 2017, 2019లోనూ మోటర్లు ఏర్పాటు చేసి సాగర్లో 500 అడుగుల వరకు ఉన్న నీటిని తరలించారు. కొన్ని సందర్భాల్లో నదిలో కాల్వ తవ్వకం చేపట్టి నీటిని పుట్టంగండి మోటర్లకు అందించారు. ప్రస్తుతానికి డ్రెడ్జింగ్తో పనిలేకుం డా నీటిని తరలించనున్నారు. ప్రస్తుతం ఏఎమ్మార్పీ ద్వారా హైదరాబాద్కు 520 క్యూసెక్కులు (1230 ఎంఎల్డీ) నీటిని తరలిస్తున్నప్పటికీ రానున్న రెండు నెలల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మరో ఐదారు రోజుల్లో అత్యవసర మోటర్లను నడపనున్నట్టు డీజీఎం వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు.