హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): యువ అధికారులంతా దేశ సేవకు అంకితం కావాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే పిలుపు ఇచ్చారు. వాయుసేనకు చెందిన 165 మంది ఫ్లయింగ్ క్యాడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకొన్నారు. శనివారం దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్న ఈ క్యాడెట్లను మనోజ్ పాండే అభినందించారు. వారిని సుశిక్షితులుగా మార్చిన దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీ సిబ్బందికి మనోజ్ పాండే శుభాకాంక్షలు తెలిపారు.
యువ అధికారులు ఎప్పటికప్పుడు కొత్త అంశాలను నేర్చుకొంటూ విధి నిర్వహణలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఫ్లయింగ్ ఆఫీసర్ రాఘవ్ అరోరాకు రాష్ట్రపతి ఖడ్గాన్ని బహూకరించారు. ఈ పరేడ్ సందర్భంగా తేజస్, సూర్యకిరణ్, సారంగ్ బృందాల విన్యాసాలు ఆహూతులను ఆకట్టుకొన్నాయి. కార్యక్రమంలో ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, ఎయిర్ మార్షల్ మన్వీందర్ సింగ్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ కమాండింగ్ ఆఫీసర్ బీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.