Agnipath Protest | కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశ యువత ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. మొదట బీహార్లో ప్రారంభమైన నిరసన కార్యక్రమాలు.. క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలకు వ్యాపించాయి. అన్ని రాష్ట్రాల్లో ఆర్మీ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న యువత.. అగ్నిపథ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి కూడా ఇవాళ జరిగింది. వందలాది మంది యువత సికింద్రాబాద్ స్టేషన్ను ముట్టడించి.. పలు రైళ్లకు నిప్పు పెట్టారు.
ఈ నెల 14న అగ్నిపథ్ స్కీమ్ను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచే అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఏం చేయాలనే అంశంపై ఆర్మీ ఉద్యోగార్థులు ఆలోచించడం మొదలు పెట్టారు. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 1:50 గంటలకు రైల్వే స్టేషన్ బ్లాక్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారు. అదే రోజు వరంగల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ పేరుతో మరో గ్రూపును(రాత్రి 11:12 గంటలకు) క్రియేట్ చేశారు. ఒక్క రోజులోనే గ్రూప్లో మొత్తం 1000 మంది జాయిన్ అయ్యారు. ఇక 17వ తేదీన సికింద్రాబాద్ జంక్షన్ను ముట్టడించాలని గ్రూపుల్లో చర్చించుకున్నారు.
ముందు ప్లాన్ చేసుకున్న ప్రకారం.. 16వ తేదీ రాత్రి 10 గంటల వరకు దాదాపు 500 మంది యువత సికింద్రాబాద్ స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకున్నారు. రాత్రే ఓ 100 మంది దాకా స్టేషన్ లోపలికి ప్రవేశించారు. 17వ తేదీన ఉదయం 9:30 గంటల వరకు మరి కొంతమంది స్టూడెంట్స్ స్టేషన్కు చేరుకున్నారు. ఆ తర్వాత అగ్నిపథ్కు వ్యతిరేకంగా యువత స్టేషన్ను ముట్టడించి.. పలు రైళ్లకు నిప్పు పెట్టారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అయితే ఆర్మీ ఎగ్జామ్ చాలా కాలంగా పెండింగ్లో ఉండటంతో.. ఆ పరీక్ష నిర్వహించాలనే డిమాండ్తో స్టేషన్ను ముట్టడించాలని యువత నిర్ణయించారు. కానీ అంతలోనే అగ్నిపథ్ స్కీమ్పై ప్రకటన చేయడంతో.. తమ పంథాను మార్చుకుని.. విధ్వంసం సృష్టించారు.