నల్లగొండ ప్రతినిధి, జూన్4(నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నల్లగొండ పట్టణ శివారులోని ఎ.దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో నాలుగు కౌంటింగ్ హాల్స్లో బుధవారం ఉదయం8గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సుల నుంచి ఓట్లను కట్టలు కట్టి మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. తుది ఫలితం తేలేందుకు అర్ధరాత్రి అయ్యే అవకాశముంది. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి సహా మొత్తం 52మంది అభ్యర్థులు బరిలో ఉండగా కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసి, 144 సెక్షన్ అమలుచేశారు. కౌంటింగ్కు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన ప్రకటించారు. కౌంటింగ్ కేంద్రం ఏరియాలో 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ గుమికూడవద్దని ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నాలుగు కౌంటింగ్ హాల్స్లో ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. వీటిపై ముందుగా బ్యాలెట్ పత్రాలను కట్టలు కడుతారు. 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను వరుస క్రమంలో టేబుల్కు ఒకటి ఇచ్చి ఒపెన్ చేస్తారు. బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పేపర్లను టేబుల్పై కుప్పగా పోసి 25 పేపర్లను ఒక కట్టగా చేసి బండిల్స్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా ఇదే సమయంలో వీటితో కలిపేస్తారు. ఎప్పటికప్పుడూ వీటిన్నింటినీ తీసుకెళ్లి ఓ పెద్ద డ్రమ్లో వేస్తారు. బండిల్ కార్యక్రమం మొత్తం పూర్తయ్యాక అసలు లెక్కింపు మొదలుకానుంది. అయితే ఇలా బండిల్ కట్టేందుకే కనీసం ఐదు నుంచి ఆరు గంటల సమయం పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఇది కొనసాగుతుండవచ్చని అంచనా. తొలి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కిస్తారు. లెక్కింపునకు రెండు రోజుల సమయం పట్టవచ్చని భావిస్తున్న అధికారులు షిప్టులుగా సిబ్బందిని నియమించారు. 2021లో కౌంటింగ్కు 90 గంటల సమయం పట్టడంతో ఈసారి అదనపు టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో ప్రస్తుతం 36 గంటలలోపే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు.
తొలి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యే సరికి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లపై అదేవిధంగా గెలుపు కోటాపై స్పష్టత వస్తుంది. అప్పటికీ ఏ అభ్యర్థి గెలుపు కోటా ఓట్లు సాధించలేకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెడతారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ రౌండ్ను ప్రారంభిస్తారు. ఆయనకు బ్యాలెట్లో పడిన ద్వితీ య ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థుల వారీగా పంచుతూ వస్తారు. ఇలా ఒక్కో అభ్యర్థిని కిందినుంచి పైకి ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఏ అభ్యర్థికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే అక్కడితో కౌంటింగ్ను నిలిపివేసి విజేతను ప్రకటిస్తారు. అయితే మొత్తం 52 మంది బరిలో ఉండడంతో ఎలిమినేషన్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. కిందటిసారి ఎలిమినేషన్ రౌండ్కే 44గంటల సమయం పట్టింది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలోనూ విజేత తేలకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించనున్నారు. కానీ ఇంతవరకు తృతీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరిగిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు.