హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): కృష్ణాజలాల వినియోగానికి సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహించిన సమావేశానికి ఎలాంటి ఇండెంట్ లేకుండానే తెలంగాణ అధికారులు హాజరయ్యారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ నుంచి జలాల తరలింపునకు ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రతిపాదనలకు సైతం అంగీకారం తెలిపారు. రాష్ట్ర ఇంజినీర్లు వివరాలివ్వని నేపథ్యంలో మరోసారి సెప్టెంబర్ 4వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ప్రస్తుతమున్న జలాలను తాగునీటికే వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నీటి అవసరాలపై చర్చించే సింగిల్ ఎజెండాతోనే జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ కాంబోజ్ నేతృత్వంలో తెలంగాణ సాగునీటిపారుదల శాఖ ఈఎన్సీ రమేశ్బాబు, ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ ఈఎన్సీ నర్సింహమూర్తి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రెండు రిజర్వాయర్ల నుంచి అక్టోబర్ చివరినాటికి కావాల్సిన నీటి అవసరాల డిమాండ్లను సమావేశం ముందు పెట్టింది. పోతిరెడ్డిపాడు నుంచి 22 టీఎంసీలు, హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి 11 టీఎంసీలు, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువ కింద 8 టీఎంసీలు, కృష్ణా డెల్టా కోసం 6 టీఎంసీలు మొత్తంగా 47 టీఎంసీలు తాగునీటికి అవసరమని డిమాండ్ చేసింది. అదీగాక 66:34 నిష్పత్తిలోనే ఈ ఏడాది కూడా జలాలను వినియోగించుకుంటామని స్పష్టం చేసింది. అయితే, పోతిరెడ్డిపాడుసహా ఏపీ చేసిన నీటి డిమాండ్లు, తరలింపునకు తెలంగాణ ఈ సందర్భంగా ఆమోదం తెలిపింది.
అదేవిధంగా ఎలాంటి ఇండెంట్ను ప్రతిపాదించకుండా 50ః50 నిష్పత్తిలో జలాలను వినియోగించుకుంటామని, ఏపీతో సమానంగా 47 టీఎంసీలను వినియోగించుకుంటామని తెలంగాణ డిమాండ్ చేసింది. అక్టోబర్ వరకే కాకుండా, ఏడాది మొత్తానికి సంబంధించి నీటి అవసరాలపై చర్చించాలని కోరింది. ఈ నేపథ్యంలో బోర్డు జోక్యం చేసుకొని నీటి వినియోగాలకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా అవసరాలు, తదితర వివరాలను ఇవ్వాలని తెలంగాణకు సూచించింది. మరోసారి సెప్టెంబర్ 4వ తేదీన సమావేశమై నీటి అవసరాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అందుకు ఇరు రాష్ర్టాల ఈఎన్సీలు అంగీకరించడంతో నీటివాటాలు తేలకుండానే త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది.