హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ను శుక్రవారం విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. మంత్రి కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గను దర్శించుకున్న అనంతరం ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఏపీ రెవెన్యూ భవన్ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు బొప్పరాజు, ప్రధాన కార్యదర్శి వైఏ రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఉద్యోగుల సమస్యలపై ఉమ్మడి రాష్ట్రంలో శ్రీనివాస్గౌడ్ చేసిన కృషిని ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు గుర్తు చేసుకున్నారు.
విదేశీయులను ఆకర్షిస్తున్న తెలంగాణ
దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున టూరిస్టులు తెలంగాణలో పర్యటిస్తున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం ఏపీ పర్యటనలో భాగంగా మంత్రి కృష్ణానది త్రివేణి సంగమంలో ఏపీ మంత్రి జోగి రమేశ్తో కలిసి పర్యటించారు. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోటులో ప్రయాణించారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమం విశిష్టత, ఏపీ టూరిజం కార్యక్రమాలను మంత్రి పరిశీలించారు. తెలంగాణలో పర్యటించాలని ఏపీ మంత్రిని ఆహ్వానించారు.