హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సినీ సాహిత్యానికి విశ్వఖ్యాతిని తెచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్కు 28న రవీంద్రభారతిలో ఘనంగా అభినందన సభను ఏర్పాటు చేసినట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ‘నాటు.. నాటు’ పాట ప్రపంచ ప్రజల అభిమానాన్ని అందుకోవటం తెలంగాణ సమాజం గర్వించదగినదని ఆయన పేరొన్నారు. బుధవారం సాహిత్య అకాడమీ కార్యాలయంలో గౌరీ శంకర్ అధ్యక్షతన చంద్రబోస్ అభినందన సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ.. మొదటిసారి తెలుగు గీతానికి ఈ అవార్డు రావడం ఆనందించాల్సిన విషయమన్నారు. దీనికి కారకుడైన చంద్రబోస్కు, ఆ పాటకు సంగీతం, నృత్యం, దర్శకత్వం వహించిన వారందరికీ అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలంగాణ సాహితీ రాష్ట్ర కార్యదర్శి కే ఆనందచారి, సహ కార్యదర్శి ఎస్కే సలీమా, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.