హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖలో సంస్కరణల చేపట్టాలన్న సర్కార్ ఆలోచన కొత్త సమస్యలు తెచ్చిపెట్టనుందా? గందరగోళంలోకి నెట్టనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖకు, సమగ్రశిక్ష ప్రాజెక్ట్ (ఎస్ఎస్ఏ)కు సమన్వయం బెడిసికొట్టే పరిస్థితి తలెత్తింది. ఎస్ఎస్ఏ కొత్త డైరెక్టర్ను నియమించడమే ఇందుకు కారణమన్న వాదనలున్నాయి. పాఠశాల విద్యాశాఖను గాడిలో పెట్టాలనుకొన్న ప్రభుత్వం ఇటీవలే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి సమగ్రశిక్షను వేరుచేసింది. ఎస్ఎస్ఏకు నూతన ప్రాజెక్ట్ డైరెక్టర్గా మల్లయ్య భట్టును నియమించింది. ఈ పరిణామం దేనికి దారితీస్తుందోనన్న వాదనలు విద్యాశాఖలో వినిపిస్తున్నాయి.
సమగ్రశిక్ష ప్రాజెక్ట్ పాఠశాల విద్యాశాఖలో అంతర్భాగంగా ఉండేది. పదేండ్లుగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, కమిషనర్లే ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బాధ్యతలను నిర్వర్తించేవారు. స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హోదాలో విద్యాశాఖ కమిషనర్ డైరెక్టర్గా వ్యవహరించేవారు. దేశంలోని చాలా రాష్ర్టాల్లో ఇదే తరహా విధానం అమల్లో ఉన్నది. దీనికి భిన్నంగా సర్కారు ఇటీవలే ఎస్ఎస్ఏ నూతన డైరెక్టర్ను నియమించింది. అయితే ఇతరశాఖలో పనిచేసే అధికారిని తీసుకొచ్చి ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమించడాన్ని విద్యాశాఖలోని ఇతర అదనపు డైరెక్టర్లు తప్పుపడుతున్నారు. తాముండగా, మరోశాఖలోని అదనపు డైరెక్టర్ను తీసుకొచ్చి ప్రాజెక్టు డైరెక్టర్గా నియమించడమేంటని బాహాటంగానే విమర్శిస్తున్నారు.
సమగ్రశిక్ష ప్రాజెక్టుకు జిల్లా స్థాయిలో అధికారులు లేరు. గతంలో ప్రాజెక్ట్ అధికారులుండగా (పీవో), వీరిని తొలగించి ప్రస్తుతం ఈ బాధ్యతలను డీఈవోలకే అప్పగించారు. డీఈవోలంతా విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. ఇది వరకు ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బాధ్యతలను కమిషనర్లే నిర్వర్తించడంతో పనులు చకా చకాసాగేవి. కానిప్పుడు రెండు పడవల మీద ప్రయాణం చందాన.. ఇటు కమిషనర్, అటు ప్రాజెక్ట్ డైరెక్టర్లిద్దరి ఆదేశాలను డీఈవోలు పాటించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఇదే సాధ్యమయ్యేపనేనా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యాశాఖ పాలన గాడి తప్పుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.