హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఆదివారం తెలిపారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్, రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో 9వ తరగతిలో, వికారాబాద్ జిల్లా పరిగి, ఖమ్మంలోని గిరిజన సంక్షేమ గురుకుల స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో 8వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్టు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు సోమవారం నుంచి జూలై 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 31న రాత పరీక్ష ఉంటుందని వెల్లడించారు. పాఠశాలలవారీగా ఖాళీల వివరాలను www.tswreis.ac.in, www.tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్లలో పెట్టినట్టు తెలిపారు.