హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): హజ్ యాత్రికులకు సహాయకులుగా వెళ్లే వారి ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. యాత్రికులకు ప్రయాణంలో సహకారం అందించేందుకు 300 మంది సహాయకుల ఎంపిక కోసం, అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు పేర్కొన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులై ఉండి, 50 ఏండ్ల వయసు మించని వారు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నవారు అర్హులని కమిటీ పేర్కొన్నది. అర్హులైన వారు ఫిబ్రవరి 15లోగా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలని, లాటరీ పద్ధతిలో ఈ ఎంపిక ఉంటుందని, పూర్తి వివరాలకు నాంపల్లిలోని హజ్ కమిటీ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపింది. మే లేదా జూన్ నెలలో ప్రారంభంకానున్న ఈ హజ్ యాత్రకు వెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 7,790 మంది ఇప్పటికే ఎంపికయ్యారు.