హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దుచేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సోమవారం అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్పై భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలని టీఎస్పీఎస్సీ కోరగా.. మంగళవారం విచారణ చేపడతామని జస్టిస్ అభినందకుమార్ షావిలి, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం ప్రకటించింది.
నిరుడు తొలిసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ అమలు చేశామని, రెండోసారి పరీక్ష నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ లేదన్న విషయాన్ని అభ్యర్థులకు ముందుగానే తెలియజేశామని టీఎస్పీఎస్సీ తన పిటిషన్లో పేర్కొన్నది. అభ్యర్థులు 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్న నిబంధనను హాల్టికెట్లో పొందుపర్చకపోవడాన్ని బట్టే బయోమెట్రిక్ లేదన్న విషయం స్పష్టమవుతున్నదని తెలిపింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏ దశలోనైనా సమయాన్ని, షరతులను సవరించే అధికారంతోపాటు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కమిషన్కు ఉన్నదని 2022లో జారీచేసిన నోటిఫికేషన్లోనే స్పష్టం చేశామని వివరించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-4 పరీక్షలకు మాదిరిగా గ్రూప్-1 ప్రిలిమ్స్కు అనుబంధ నోటిఫికేషన్ను జారీ చేయలేదని సింగిల్ జడ్జి తప్పుపట్టడం, నిబంధనల అమలులో కమిషన్ విఫలమైందంటూ పరీక్షను రద్దు చేయడం సబబు కాదని పేర్కొన్నది. సింగిల్ జడ్జి రికార్డుల్లో లేని విషయాల్లోకి వెళ్లారని, ప్రతిభ ఉన్న అభ్యర్థుల ప్రధాన హకుకు నష్టం జరుగుతుందని నిరాధారంగా చెప్పడం సరికాదని తెలిపింది. ప్రిలిమ్స్కు 2,33,218 మంది హాజరైనట్టు తొలుత ప్రాథమిక సమాచారం అందిందని, ఆ తర్వాత పరీక్షా పత్రాలన్నింటినీ క్షుణంగా పరిశీలించాక మొత్తం 2,34,508 మంది హాజరైనట్టు తేలిందని, ఈ వివరాలు కౌంటర్ పిటిషన్లో తప్పుగా అచ్చయ్యాయని పేర్కొన్నది. ఈ విషయాలను వాదనల సమయంలో పలుమార్లు చెప్పినా సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని అప్పీల్ పిటిషన్లో వివరించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-1 పరీక్షను కొనసాగించేందుకు అనుమతించాలని కోరింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్కు బయోమెట్రిక్ను అమలు చేయకపోవడం వల్ల ఎవరికీ ఏవిధమైన నష్టం జరగలేదని, ఎవరికైనా నష్టం జరిగినట్టు పిటిషనర్లు కూడా ఆధారాలు చూపలేదని టీఎస్పీఎస్సీ తెలిపింది. అయినప్పటికీ సింగిల్ జడ్జి పిటిషన్లను అనుమతించడం, బయోమెట్రిక్ విధానం అమలులో ఉన్న ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోకుండా పరీక్షను రద్దు చేయడం, కేవలం ముగ్గురు పిటిషనర్ల కోసం 2,33,505 మంది అభ్యర్థులకు నష్టం వాటిల్లేలా తీర్పు ఇవ్వడం సబబు కాదని అపీల్లో పేర్కొన్నది. పరీక్షకు హాజరైన అభ్యర్థులను గుర్తించేందుకు శాస్త్రీయంగా ఎన్నో చర్యలు చేపట్టామని, ప్రభుత్వం జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డులనే అభ్యర్థుల గుర్తింపునకు ప్రామాణికంగా తీసుకున్నామని, ఆ కార్డులను క్షుణంగా పరిశీలించాకే అభ్యర్థులను పరీక్షలకు అనుమతించామని వివరించింది. అయినప్పటికీ ఈ జాగ్రత్తలను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని, కమిషన్ చేపట్టిన చర్యల్లో లోపాలున్నట్టు కూడా చెప్పలేదని పేర్కొన్నది.
గ్రూప్-1 ప్రిలిమ్స్కు విధిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలన్నదే పిటిషనర్ల ప్రధాన వాదన అయితే హాల్టికెట్ తీసుకోగానే కోర్టుకు వచ్చి ఉండేవారని, కానీ.. పరీక్ష రాసిన చాలా రోజుల తర్వాత తీరిగ్గా కోర్టుకు రావడాన్ని బట్టే వారి దురుద్దేశం స్పష్టమవుతున్నదని అప్పీల్ పిటిషన్లో టీఎస్పీఎస్సీ తెలిపింది. అభ్యర్థుల్లో కొందరి నుంచి బయోమెట్రిక్ తీసుకుని మిగిలినవారి నుంచి తీసుకోలేదన్నది కూడా నిజం కాదని, అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఒకే తరహాలో అభ్యర్థుల తనిఖీ జరిగిందని స్పష్టం చేసింది. ఎక్కడా తనిఖీలు ఏకపక్షంగా జరగలేదని, ఎలాంటి దురుద్దేశాలకు తావు లేదని, పిటిషనర్లు కూడా కమిషన్ ఏకపక్షంగా, దురుద్దేశాలతో వ్యవహరించినట్టు పేర్కొనలేదని వివరించింది. ఇలాంటి పరిస్థితులు లేనప్పుడు పరీక్షల వ్యవహారంలో జోక్యం చేసుకోరాదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారని తెలిపింది. దీన్ని తక్షణమే కొట్టేయాలని అప్పీల్ పిటిషన్లో టీఎస్పీఎస్సీ కోరింది.