Annamayya Jayanthi | ఐండ్హోవెన్ (నెదర్లాండ్స్), మే 24: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు ఐరోపా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నెదర్లాండ్స్లోని ఐండ్హోవెన్లో స్టిచింగ్ వసుధైవ కుటుంబకం (SVK) ఆధ్వర్యంలో జరిగిన శ్రీ అన్నమాచార్య ఆరాధన కార్యక్రమంలో పశ్చిమ ఐరోపా నలుమూలల నుంచి సుమారు 170 మంది కళాకారులు పాల్గొని సంగీత, నృత్య ప్రదర్శనలతో నివాళి అర్పించారు.
శ్రీ అన్నమాచార్యుల భక్తి సాహిత్యం, సంగీత వారసత్వాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు సంగీత, నృత్య పాఠశాలలు పాల్గొన్నాయి. ఐదేళ్ల చిన్నారుల నుంచి 75 ఏళ్ల అనుభవజ్ఞులైన కళాకారుల వరకు అన్నమయ్య సంకీర్తనలు, ఆధ్యాత్మిక కృతులను గానం చేస్తూ, నృత్య రూపకాల్లో ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గురు పరంపరను కొనసాగిస్తూ ఉపాధ్యాయులు శిష్యులకు అందించిన శిక్షణ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Annamayya Jayanthi2
కార్యక్రమానికి ఐండ్హోవెన్ నగర కౌన్సిలర్లు మిరియం ఫ్రోసీ, చైతాలి సేన్గుప్తాతో పాటు సంస్కృతి అండ్ సంస్కార్ సంస్థ ప్రతినిధి వల్లభ్ పాండే, హెచ్ఎస్ఎస్ ఐండ్హోవెన్కు చెందిన శ్రీనివాస్రెడ్డి హాజరై కళాకారులను అభినందించారు. శాస్త్రీయ కళల పరిరక్షణలో యువత భాగస్వామ్యం అభినందనీయమని పేర్కొన్నారు. పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారి విగ్రహాల సాక్షిగా నిర్వహించిన కార్యక్రమంలో కర్ణాటక సంగీత గానాలు, వాద్య ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అన్నమయ్య కీర్తనలతో భక్తి వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ఎస్వీకే ప్రతినిధులు మాట్లాడుతూ.. భౌగోళిక సరిహద్దులను దాటి భారతీయ సంస్కృతి, భక్తి సంప్రదాయాలను తదుపరి తరాలకు చేరవేయడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమ విజయానికి సహకరించిన బాలాజీ ఆలయ యాజమాన్యం, గురువులు, పాఠశాలలు, స్వచ్ఛంద కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

Annamayya Jayanth3