సూర్యాపేట: మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) సమయస్ఫూర్తి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా న్యామూర్తి ప్రాణాలను నిలబెట్టింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత (Justice Sujatha) ప్రయాణిస్తున్న వాహనం సూర్యాపేట (Suryapet) జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో జస్టిస్ సుజాత తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రథమ చికిత్స నిమిత్తం ఆమెను సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించారు. అదే సమయంలో తిరుమలగిరిలో ఓ శుభకార్యానికి హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన దవాఖానకు చేరుకున్నారు. న్యాయమూర్తి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అవసరం ఉందని వైద్యులు చెప్పడంతో.. వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు.
సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్లియరెన్స్ చేసేలా స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. ఓ వైపు జోరు వాన కురుస్తుండటంతో ఇబ్బందులు తలెత్తకుండా జస్టిస్ సుజాతను తరలిస్తున్న అంబులెన్స్ను తన కాన్వాయ్ మధ్యలో ఉంచి గంట 15 నిమిషాల్లో హైదరాబాద్ తరలించారు. దగ్గరుండి ఆమెను దవాఖానలో చేర్పించారు. ప్రస్తుతం జస్టిస్ సుజాత ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సకాలంలో న్యాయమూర్తిని హైదరాబాద్ తరలించడం మంచి పరిణామమని వైద్యులు తెలిపారు.