హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): విదేశీయానం చేసిన అర్చకుల పూజలకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విదేశాలకు వెళ్లివచ్చిన అర్చకులు దేవాదాయశాఖకు చెందిన ఆలయాల్లోని ప్రధాన గర్భాలయాల్లో ప్రవేశానికి, పూజల నిర్వహణకు అనర్హులను స్పష్టంచేసింది. ఏపీ దేవాదాయ శాఖ పరిధిలో పనిచేసే అర్చకుల్లో ఎవరైనా విదేశాలకు వెళ్లి వస్తే, వారికి గర్భాలయంలో పూజా కార్యక్రమాల నిర్వహణకు అనుమతించరాదని 2010లో జారీచేసిన సరులర్ను విధిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాక, 2024లో శృంగేరి శారదాపీఠం జగద్గురువులు మ్రహాతీర్థ భారతీస్వామి విడుదల చేసిన ప్రామాణికాన్ని కూడా పాటించాల్సిందేనని జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఉత్తర్వులను వెలువరించారు.
విదేశీయానం చేసి వచ్చిన పలువురు ప్రధాన అర్చకులకు విజయవాడ, దుర్గమ్మ ఆలయంలోని గర్భాలయంలో అర్చకత్వ బాధ్యతలు అప్పగించడాన్ని తప్పుపడుతూ ఆదే ఆలయంలో శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారుగా సేవలందిస్తున్న డీఎస్ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం సోమయాజీ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది కేఆర్ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. దేవాదాయ శాఖ నిబంధనలు, ఏపీ ధార్మిక పరిషత్తు సర్క్యులర్ ప్రకారం అర్చకులు విదేశాలకు వెళ్లి తిరిగి వస్తే వారికి గర్భాలయంలో అర్చకత్వం నిర్వంచే అర్హత ఉండదని చెప్పారు. అలాంటి అర్చకులు ఆలయం వెలుపల జరిగే వ్రతాలు, పూజలు తదితర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించవచ్చునని తెలిపారు.
శృంగేరి శారదాపీఠం జగద్గురువులు 2024 డిసెంబర్ 12న జారీచేసిన ప్రామాణికం కూడా అదేనని అన్నారు. గర్భాలయంలో పూజలు నిర్వహించే అర్చకులు త్రికాల సంధ్యా వందనం, గురు ఉపదేశ మంత్ర జపం, వేదాధ్యయనం, ఆహార నియమాలు వంటి కఠిన ఆధ్యాత్మిక నియమాలను పాటించాలని వెల్లడించారు. విదేశాలకు వెళ్లిన వారు, జుట్టు కత్తిరించుకున్న వారు గర్భాలయంలోకి ప్రవేశించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దేవాదాయ శాఖ అధికారులు 2010లో ఇచ్చిన సరులర్ను గానీ, 2024లో జారీఅయిన ప్రామాణికాలను గానీ అమలు చేయడం లేదని ఆరోపించారు. వాదనలపై స్పందించిన హైకోర్టు.. అన్ని దేవస్థానాల్లో నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.