హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రూ.2,56,257 కోట్లతో 2022-23 వార్షిక బడ్జెట్ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శుక్రవారం ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం రూ.47,996 కోట్లు. రెవెన్యూలోటు రూ.17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724కోట్లు, జీఎస్డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతంగా బడ్జెట్లో పొందుపరిచారు. వార్షిక బడ్జెట్లో భాగంగా రూ.11,387.69 కోట్ల వ్యవసాయ బడ్జెట్ను ఆశాఖ మంత్రి కన్నబాబు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఏపీ మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్మోహన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన వారిని పక్కన పెట్టినట్టు కాదని పేర్కొన్నారు. మళ్లీ గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరేనని, మంత్రివర్గంలో లేనివాళ్లు పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చనే ఊహాగానాలకు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు బలం చేకూర్చాయి.