జోగుళాంబ గద్వాల : ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో అనుమతి పత్రాలు లేకుండా వస్తున్న ఏపీ అంబులెన్స్లను తెలంగాణ పోలీసులు మళ్లీ నిలిపేస్తున్నారు. కర్నూలు జిల్లా సరిహద్దులోని పుల్లూరు చెక్పోస్టు వద్ద అర్ధరాత్రి తర్వాత నుంచి పెద్ద ఎత్తున అంబులెన్స్లు నిలిచిపోయాయి. హైదరాబాద్లోని దవాఖానల నుంచి బెడ్ అనుమతి పత్రం, తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ-పాస్ ఉంటేనే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో సుమారు 20 అంబులెన్స్లు పుల్లూరు చెక్పోస్టు వద్ద నిలిచిపోయాయి.
అయితే నిబంధనల మేరకు అనుమతులు ఉన్న అంబులెన్సులను మాత్రమే తెలంగాణలో కి అనుమతి ఇస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు అంబులెన్స్లు ఆపేసిన విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ పుల్లూరు చెక్పోస్టు వద్దకు చేరుకున్నారు. తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు.
ఈ-పాస్, బెడ్లు ఖాళీగా ఉన్నట్లు అనుమతులు ఉంటేనే విడిచిపెడుతున్నామని ఎమ్మెల్యేకు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దీంతో అన్ని అనుమతులు ఉన్నాకే హైదరాబాద్ బయల్దేరాలని రోగుల బంధువులకు ఎమ్మెల్యే సూచించారు.
అనుమతులు లేకుంటే హైదరాబాద్ వెళ్లి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారిని కర్నూలు ప్రభుత్వ దవాఖానకు ఎమ్మెల్యే పంపించారు.
దవాఖానలో బెడ్ అందుబాటులో ఉన్నట్లు అనుమతి పత్రం, ప్రభుత్వం నుంచి ఈ- పాస్ ఉన్నవాళ్లు మాత్రమే ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లాలని కర్నూలు ఎమ్మెల్యే సూచించారు.