హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టారు.. అయినా ఆయకట్టుకు చుక్క నీరివ్వడం లేదు.. ఏటీఎంగా మార్చుకొన్నారు.. ఇవీ బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణలు. కొన్ని మీడియా సంస్థల అసత్య ప్రచారాలు. అదే నిజమైతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? నాటికీ నేటికీ వర్షపాతంలో పెద్దగా మార్పులేదు. తెలంగాణ నేలలో మార్పు రాలేదు. మరి ఆ రోజున చుక్క నీరు లేక ఎండిన చెరువులు.. నేడు మండుటెండల్లోనూ మత్తళ్లు ఎలా దుంకుతున్నాయి? శ్రీరాంసాగర్, లోయర్మానేర్ డ్యామ్లు ఎక్కడి నీటితో నిండుతున్నాయి? తుమ్మలు మొలచిన వరద కాలువ ఎట్లా జీవనదిగా మారింది? చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సారెస్పీ నుంచి 384 కిలోమీటర్ల పొడవునా కాకతీయ కాలువ దరులను ఒర్సుకొని ఎట్ల పారుతున్నది? పిల్లి శకునాలు పలికేవారికి ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదు. కానీ, ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం.. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అహోరాత్రులు కష్టపడి రూపుదిద్దిన ఈ కాళేశ్వరమే నేడు తెలంగాణకు కల్పతరువు. ఇది రాష్టంలో రాజకీయాలకు సంబంధంలేని ప్రతి పౌరుడు నమ్ముతున్న నిజం. కానీ కొన్ని మీడియా సంస్థలు నీతిమాలిన రాతలు రాస్తూ ప్రాజెక్టుపై బురదజల్లే ప్రయత్ని చేస్తున్నాయి.
అన్నింటికీ జీవధారగా కాళేశ్వరం
330 టీఎంసీల నీటి వినియోగానికి రూపకల్పన చేసిన ఎస్సారెస్పీ, ఇప్పుడు వాస్తవంగా 80 టీఎంసీలకు కుచించుకపోయిందని అంచనా. మరి దాని ఆయకట్టు పరిస్థితి? రాష్ట్రంలోని మిగతా ప్రాజెక్టుల పరిస్థితీ అంతే. వాటి పూడిక తీయలేం. కొత్తగా ఆ స్థాయిలో ప్రాజెక్టులను నిర్మించడమూ అసాధ్యం. దీంతో సుదీర్ఘ మేధోమథనం సాగించి సీఎం కేసీఆర్ సృష్టించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉమ్మడి పాలకులు సృష్టించిన శతకోటి సమస్యలకు పరిష్కారం చూపింది. పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు భరోసానివ్వడమేగాక కొత్త ఆయకట్టుకు పురుడుపోస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడం వల్ల తెలంగాణలోని గోదావరి ముఖచిత్రం మారిపోయింది. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే గోదావరిలో మనవాటా 954 టీఎంసీల్లో 750 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకొనేందుకు మార్గం సుగమమైంది.
ప్రాణహిత జలాలను ఎదురెక్కించడం వల్ల 150 కిలోమీటర్ల ప్రధాన గోదావరి సజీవంగా మారింది. ఎగువ నుంచి వరద వచ్చినా, రాకున్నా ఎల్లంపల్లికి ఢోకా లేకుండా పోయింది. ఎగువ, మధ్య, దిగువ మానేరుకు కాళేశ్వర గంగ శాశ్వత భరోసా కల్పించింది. సింగూరుకు ఊపిరిలూదింది. హల్దీ వాగుద్వారా నిజాంసాగర్కు ప్రాణహిత జలాలతో ప్రాణం పోస్తున్నది. వాస్తవాలు ఇలా ఉంటే, కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం.. కాళేశ్వరం ప్రాజెక్టు ఔన్నత్యాన్ని దెబ్బతీయటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ వాదులు, సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. సంచలనాల కోసం, మీడియాలో ప్రచారం కోసమే చవకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కాళేశ్వరమే తెలంగాణ భవిష్యత్తు
రాజకీయ నేతలు హుందాగా వ్యవహరించాలి. లోపాలుంటే విమర్శించాలె. వాస్తవాలను ఒప్పుకోవాలి. పత్రికలు సైతం విలువలు పాటించాలె. నిజాలను దాచి అసత్య ప్రచారం చేయడం తగదు. రాష్ట్రంలో కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు, మీడియా సంస్థలు పనిగట్టుకొని ఒకే ప్రాజెక్టుపై విమర్శలకు దిగుతున్నాయి. రాజకీయ దురుద్దేశం తప్ప అందులో మరేమీ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణ భవిష్యత్తు. కాళేశ్వరం ద్వారా పాత ప్రాజెక్టులకు జీవం వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. దిగుబడి పెరిగింది.
– తన్నీరు వెంకటేశం, ఇంజినీర్స్ జేఏసీ చైర్మన్