హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మరో దివ్య క్షేత్రానికి వేదిక కాబోతున్నది. కరీంనగర్ నడిబొడ్డున శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరగబోతున్నది. దీనికి సంబంధించి ఇటీవలే.. తిరుమల తిరుపతి దేవస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాదాద్రి తరహాలో పెద్దఎత్తున ఆలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీనికోసం కరీంనగర్ నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన 10 ఎకరాల స్థలం కేటాయించారు. దీనిలో భాగంగా ఏపీలోని అమరావతిలో వెంకటాచల టీటీడీ ఆలయ నిర్మాణ పనులను తెలంగాణ బృందం శనివారం పరిశీలించింది.
కరీంనగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గుండవరం వెంకటభాసరరావు ఆలయాన్ని సందర్శించారు. ఎకరా విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం అదే ఆలయంలో స్థపతులుగా పనిచేస్తున్న టీటీడీ ప్రధాన స్థపతి మునిస్వామిరెడ్డి, సహాయ స్థపతి కృష్ణారావును తీసుకుని కరీంనగర్ వెళ్లారు. ఆదివారం టీటీడీ స్థపతులు, కరీంనగర్ రెవెన్యూ యంత్రాంగం, యాదాద్రికి పనిచేసిన ఆనంద్సాయి తదితరులు కరీంనగర్లో ఆలయ నిర్మాణం జరగబోయే స్థలాన్ని పరిశీలిస్తారు. వెంటనే ఆలయ డిజైన్లు ఇవ్వాల్సిందిగా మంత్రి ఆదేశించారు.
దార్శనికుడు కేసీఆర్: మంత్రి గంగుల
సీఎం కేసీఆర్ గొప్ప దార్శనికుడు, ధార్మికుడని, ధర్మ పరిరక్షణలో ఎల్లప్పుడూ ముందుంటారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. యాదాద్రిని అతితక్కువ సమయంలోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం పుణ్యక్షేత్రాలకు దీటుగా కరీంనగర్ వేంకటేశ్వరాలయం నిర్మిస్తామని తెలిపారు. వినోద్కుమార్ మాట్లాడుతూ… కరీంనగర్లో స్థలకొరత లేదని, సువిశాలంగా భక్తులకు ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లేలా ఆలయ నిర్మాణం ఉంటుందన్నారు. నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు, భాస్కర్రావు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ సంకల్పంతో నిర్మితమయ్యే వేంకటేశ్వరుని ఆలయం మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా కీర్తి గడించడం ఖాయమని చెప్పారు. అంతకుముందు సూర్యాపేటలో జిల్లా యంత్రాంగం మంత్రి బృందానికి స్వాగతం పలికింది.