హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 18 (నమస్తే తెలంగాణ): ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2.86 నుంచి వచ్చిన మరో ఉప వేరియంటే ఈ ‘జేఎన్.1’. జేఎన్.1(పిరోల) అనే కొత్త కరోనా వేరియంట్కు వేగంగా వ్యాప్తి చెందే స్వభావం ఉన్నదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్ భారత్తో సహా 38 దేశాలను చుట్టేసిందని, మన దేశంలో కూడా కేరళతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు సైతం జేఎన్.1 వేరియంట్ వ్యాపించినట్టు వార్తలు వస్తున్నాయని వైద్యాధికారులు తెలిపారు.
ఒమిక్రాన్ ఉపవేరియంట్ బీఏ.2.86లోని స్పైక్ ప్రొటీన్లలో 20 మ్యుటేషన్లు ఉండగా దాని ఉపవేరియంటైన జేఎన్.1 (పిరోల) వైరస్లోని స్పైక్ ప్రొటీన్స్లో 21మ్యుటేషన్లు ఉన్నట్లు వైద్యనిపుణులు వివరించారు. బీఏ.2.86 వేరియంట్కు, జేఎన్.1 వేరియంట్కు కేవలం ఒక స్పైక్ ప్రొటీన్ మ్యుటేషనే తేడా ఉందని, ఈ మ్యుటేషన్ల వల్లనే వైరస్కు వేగంగా వ్యాప్తిచెందే స్వభావం ఉంటుందంటున్నారు వైద్యులు.
జేఎన్.1 వేరియంట్ లక్షణాలు
సాధారణ జలుబు, సాధారణ జ్వరం, దగ్గు, ముక్కు కారడం, తలనొప్పి, ఒంటి నొప్పులు, నీరసం, కళ్లు ఎర్రబడడం, కడుపులో నొప్పి, సాధారణ వైరల్ ఫీవర్ లక్షణాలు ఉంటాయి.
జాగ్రత్తలు తప్పనిసరి
ప్రస్తుతం మన దగ్గర ‘ఇన్ఫ్లుయెంజా’ కేసులు పెద్దగా లేవు. రెస్పిరేటరీకి సంబంధించిన లక్షణాలతో కూడిన కేసులు పెద్దగా నమోదు కావడం లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. గాంధీ దవాఖానలో కరోనా వార్డు కొనసాగిస్తున్నాం.
– డాక్టర్ రాజారావు, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్
ప్రత్యేక లక్షణాలేవీ లేవు
జేఎన్.1 వేరియంట్కు సంబంధించి ప్రత్యేక లక్షణాలేవీ లేవు. 90 శాతానికి పైగా ప్రజలు వ్యాక్సినేషన్ చేసుకోవడం వల్ల జేఎన్.1ప్రభావం ఇక్కడి ప్రజలపై పెద్దగా ఉండే అవకాశాలు లేవు. వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి.
– డాక్టర్ కిరణ్ మాదాల, నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన క్రిటికల్ కేర్ నిపుణులు