హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): కోకాపేటలో 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయిస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్కు నెంబర్ కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జూకంటి అనిల్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది.
గండిపేట మండలం కోకాపేటలోని 239, 240 సర్వే నెంబర్లల్లోని 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన న్యాయవాది వెంకట్రామిరెడ్డి ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. బీఆర్ఎస్కు భూమి కేటాయింపును రద్దు చేయాలంటూ గతంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన వ్యాజ్యంతో కలిపి ఈ పిల్ను విచారిస్తామని కోర్టు ప్రకటించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ పిల్కు నెంబర్ కేటాయించేందుకు గతంలో రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టు పకకుపెట్టింది. నెంబర్ కేటాయించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.