ఖానాపురం, ఏప్రిల్ 8: విద్యుత్తు షాక్తో మరో రైతు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కొడ్తిమాట్తండాలో సోమవారం చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోత్ చందర్ (50) తన పొలంలో మక్కజొన్న పంటను సాగు చేస్తున్నాడు. కొద్దిరోజులుగా తన బావిలో నీళ్లులేకపోవడంతో పంట ఎండిపోతున్నది. పక్కనే ఉన్న తన బాబాయి సోమ్లా బావి నుంచి నీటిని తన పొలానికి పారించేందుకు వెళ్లాడు. మోటరు వేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్కు గురై చందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమీప పొలాల్లోని రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి వివాహం కాగా, చిన్న కుమారుడికి ఈ నెల 24న వివాహం జరగాల్సి ఉన్నది. ఇంతలోనే విద్యుత్తు షాక్తో మరణించడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రఘునాథ్ తెలిపారు.