హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ మరో శుభవార్త చెప్పింది. సిబ్బందికి మరో విడత కరువు భత్యం ఇవ్వనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఫిబ్రవరి నెల జీతంతో కలిపి ఈ డీఏను చెల్లిస్తామని చెప్పారు. హైదరాబాద్లో బుధవారం జరిగిన ఆర్టీసీ ఉద్యోగ సంక్షేమ మండలి సమావేశంలో సజ్జనార్ మాట్లాడుతూ.. ‘మా అందరికి మీరే స్ఫూర్తి. నిరుడు మీ అందరి కృషి వల్లే సంస్థ నష్టాలు ఏకంగా 70 శాతం మేర తగ్గాయి. భవిష్యత్తులోనూ వ్యయాన్ని తగ్గించి ఆదాయాన్ని పెంచేలా పాటుపడాలి. త్వరలోనే ప్రయాణికులకు స్మార్ట్కార్డులు ఇస్తాం. వాటితో ప్రయాణించేవారికి లాయల్టీ పాయింట్లతో రాయితీలు కల్పిస్తాం’ అని సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమ మండలిలోని ఉత్తమ సభ్యులు 22 మందిని సజ్జనార్ సన్మానించారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో రవీందర్, ఈడీలు మునిశేఖర్, పురుషోత్తం సీపీఎం కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.