హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడులను ఆదర్శంగా తయారుచేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కూల్స్ (పీఎం శ్రీ) పథకానికి రాష్ట్రం నుంచి మరో 251 సర్కారు స్కూళ్లు ఎంపికయ్యాయి. ఎంపికైనవాటిలో ప్రాథమిక పాఠశాలలకు రూ.కోటి, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.కోటిన్నర, ఉన్నత పాఠశాలలకు రూ.రెండు కోట్లు చొప్పున నిధులను ఖర్చు చేస్తారు.
ఈ విద్యాసంవత్సరంలో పీఎం శ్రీ పథకం కింద 543 స్కూళ్లు ఎంపిక కాగా, వచ్చే విద్యాసంవత్సరానికి 251 స్కూళ్లను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రతిపాదించారు. ఇటీవలే నిర్వహించిన ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు సమావేశంలో రాష్ట్రం ప్రతిపాదించగా, ఈ 251 స్కూళ్ల అభివృద్ధికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ పథకంలో భాగంగా బడులను పూర్తిగా హరిత పాఠశాలలుగా అభివృద్ధి చేస్తారు. వీటిల్లో సోలార్ ప్యానళ్లు, ఎల్ఈడీ లైట్లు, ప్లాస్టిక్ రహిత, వ్యర్థ పదార్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, పోషకాహార తోటల పెంపకం, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతారు.