హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోటా టికెట్లను ఈనెల 13న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి ఆలయంలో బాలాలయం మరమ్మతుల కారణంగా ఈ నెల 22 నుంచి 28 వరకు విడుదల చేయాల్సిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం ఆ కార్యక్రమం వాయిదా పడటంతో నిలిపివేసిన దర్శనం టికెట్లను సోమవారం తిరిగి విడుదల చేయనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. మార్చి నెలకు నిలిపివేసిన అంగప్రదక్షణ టోకెన్ల కోటాను శనివారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
తిరుమలకు పెరిగిన రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్నది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు వచ్చిన భక్తులతో10 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం 59,090 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 22,593 మంది తలనీలాలు సమర్పించుకొన్నారు. భక్తులు సమర్పించుకొన్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
జూబ్లీహిల్స్ వేంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 నుంచి 28 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెల 19న మెగా ఉత్సవానికి అంకురార్పణ నిర్వహించనున్నట్టు చెప్పారు. 20న ధ్వజారోహణం, 24న గరుడసేవ, 27న రథోత్సవం, 28న చక్రస్నానం, మార్చి 1న పుష్పయాగం నిర్వహిస్తామని వెల్లడించారు.