హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై(Governor Tamilisai) చేసిన ప్రసంగం చాలా బాధాకరమని ఎఫ్దీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం(Anil Kumar) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను పరాయి పాలన నుంచి, వివక్ష నుంచి విముక్తి చేసిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. అలాగే తన ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రన్ని సాధించడమే కాకుండా స్వయంపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ కాలంలో దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మొదటి స్థానంలో నిలిపారన్నారు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉండి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా మాట్లాడినట్టు ఉందని, బాధ్యత గల పదవిలో ఉండి ప్రజలకు వాస్తవాలు తెలుపాల్సింది పోయి అవాస్తవాలు చెప్తున్నారని అనిల్ కూర్మాచలం ఆవేదన వ్యక్తం చేశారు.