హైదరాబాద్ : మానవ అక్రమ రవాణాను అరికట్టడంపై కూడా అంగన్వాడీలు సోషల్ పోలీస్గా పనిచేయాలని, మహిళలకు, పిల్లలకు రక్షణ కవచంలాగా మారాలని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ లో మానవ అక్రమ రవాణ నిర్మూలన కోసం రూపొందించిన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనకు పనిచేసిన అధికారులు, అంగన్వాడీ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ఇచ్చి సత్కరించారు. లైంగిక దాడికి గురై స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరిగి జీవితాన్ని ప్రారంభించి, అక్రమ రవాణా నిర్మూలనకు పనిచేస్తున్న మహిళలను మంత్రి సత్కరించారు.
ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణకు పాల్పడుతున్న వారిలో పురుషులే కాకుండా మహిళలు కూడా ఉండడం దురదృష్టకరం అన్నారు. బాధితులుగా మారిన వారిని చేయని నేరానికి తల్లిదండ్రులు కూడా శిక్షిస్తున్న ఈ సమాజంలో ప్రజ్వల వంటి సంస్థలు వారిని చేరదీసి, ఆశ్రయం ఇచ్చి, తిరిగి గౌరవ ప్రదమైన జీవనం కల్పించడం నిజంగా చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఈ అక్రమ రవాణాలో ప్రధానంగా దోషులను పట్టుకునేది, బాధితులను రక్షించేది పోలీసులు అన్నారు. ఈ మానవ అక్రమ రవాణాను ఆపటం ఏ ఒక్కరితో సాధ్యం అయ్యేది కాదు. సమాజం పాత్ర చాలా ముఖ్యమైందన్నారు.
కుటుంబంలో అమ్మాయిల పట్ల ఉన్న వివక్ష పోవాలి. కుటుంబాలకు అవగాహన కల్పించాలి. సమాజంలో చైతన్యం కల్పించడం ద్వారా ఈ అక్రమ రవాణాను నిర్మూలించాలన్నారు. దేశంలో మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో, వారికి పునరావాసం కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం బాగా పని చేస్తుందని ప్రజ్వల సంస్థ వ్యవస్థాపక నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ చెప్పడం చాలా సంతోషం అని ఇది తమపై మరింత బాధ్యత పెంచిందని మంత్రి పేర్కొన్నారు.