హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ టీచర్లకు శుభవార్త. దశాబ్దాల నుంచి అంగన్వాడీలుగా పనిచేస్తున్నవారిని రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్-2 సూపర్వైజర్లుగా నియమించనున్నది. అర్హులైనవారికి శనివార మే పోస్టింగ్లు ఇవ్వనున్నట్టు సమాచారం. 433 గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులను అంగన్వాడీ టీచర్లతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించడంతో అర్హులకు జనవరి 2నే రాతపరీక్ష నిర్వహించి, అప్పుడే మెరిట్ లిస్ట్ను రూపొందించారు.
జిల్లాలవారీగా సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తవడంతో తమకు అన్యాయం జరుగుతున్నదంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో రాత పరీక్ష మొదలుకొని సర్టిఫికెట్ల పరిశీలన వరకు అంతా సక్రమంగానే జరిగిందని కోర్టు తీర్పు ఇచ్చింది. తదనుగుణంగా వెంటనే నియామక ప్రక్రియను చేపట్టేందుకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కసరత్తు పూర్తిచేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను శుక్రవారం రాత్రి ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేసి, శనివారం పోస్టింగ్లు ఇచ్చే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.