హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాలను అక్రమంగా బేసిన్ అవతలి ప్రాంతాలకు తరలిస్తున్న ఏపీ సర్కారు చర్యలను నిలువరించాలని హైదరాబాద్ విశ్రాంత ఇంజినీర్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అసోసియేషన్ నాయకులు భాగ్యతరెడ్డి, వెంకటరమణ, హన్మంతరెడ్డి, శ్రీనివాస్రావు, రామకృష్ణారెడ్డి, రంగారెడ్డి, నర్సింహారావు, గోవర్ధన్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, విజయకరణ్రెడ్డి ప్రభుత్వానికి శనివారం లేఖ రాశారు. బేసిన్లోనే ఉన్న తెలంగాణ రాష్ర్టానికే కృష్ణా జలాలపై పూర్తి హక్కులున్నాయని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినందున బేసిన్లో ఇప్పటికే పూర్తయిన, పూర్తికాని, ప్రతిపాదిత తెలంగాణ ప్రాజెక్టులకే కృష్ణా నికర జలాలను కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. దీనిపై ప్రశ్నించే నైతికహక్కు ఏపీకి లేదన్నారు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలు పూర్తిగా, వరంగల్, ఖమ్మం, మెదక్, కరీంనగర్ జిల్లాలు పాక్షికంగా ఉంటాయని తెలిపింది. ఆయా జిల్లాల్లో సాగుకు యోగ్యమైన భూమి 94.45 లక్షల ఎకరాలు ఉన్నదని, గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాలను కలిపితే రాష్ర్టానికి కృష్ణా నుంచి వెయ్యి టీఎంసీలు అవసరమని వివరించారు. బేసిన్లోని సాగునీటి, తాగునీటి అవసరాలు తీరిన తరువాతనే మిగులు జలాలను తరలించాల్సి ఉంటుందని, ఇదే విషయాన్ని బచావత్ ట్రిబ్యునల్ సైతం స్పష్టంచేసిందని గుర్తుచేశారు. అందుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమంగా కొనసాగుతున్న ప్రాజెక్టుల పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.