హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘మేం అడిగిందేమిటి? మీరిచ్చిందేమిటి? సీమ ఎత్తిపోతల పథకానికి అసలు అనుమతులున్నాయా? అక్కడ పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయా? అనేది సూటిగా చెప్పకుండా ఎందుకీ డొంక తిరుగుడు సమాధానాలు అంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ కేంద్రంపై మండిపడింది. సీడబ్ల్యూసీతో మళ్లీ కమిటీ వేయమంటారా? అంటూ నిలదీసింది. సీమ ప్రాజెక్టుపై సాదాసీదా నివేదికను అందజేయడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి అనుమతుల్లేకుండా ఏపీ ప్రభుత్వం చేపట్టిన సీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టు వద్ద పర్యావరణ ఉల్లంఘనలపై క్షేత్రస్థాయిలో సందర్శించి నివేదిక అందించాలని కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణ అటవీశాఖకు ఎన్జీటీ గతంలోనే ఆదేశాలు జారీచేసింది. కేఆర్ఎంబీ ఆగస్టు 27న నివేదికను సమర్పించగా, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తాజాగా నివేదిక ఇచ్చింది. మంత్రిత్వశాఖకు చెందిన శాస్త్రవేత్త పసుపులేటి సురేశ్బాబు ఈ నెల 6న సీమ ప్రాజెక్టును సందర్శించారని.. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించి పనులు కొనసాగడం లేదని నివేదించింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తు తమ పరిశీలనలో ఉన్నదని పేర్కొన్నది. దీనిపై ఎన్జీటీ చెన్నైబెంచ్లో బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వకపోవడంపై నిలదీసింది. పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయో? లేదో? సూటిగా చెప్పకుండా.. ఇప్పటికే కేఆర్ఎంబీ నివేదిక అందజేసిందని, ఈసీ దరఖాస్తు పరిశీలనలో ఉన్నదని రిపోర్టు సమర్పించడంపై అసహనం వ్యక్తం చేసింది.
ముమ్మాటికీ ఉల్లంఘనలు జరిగాయి
కేంద్రం నివేదికతో సీమ ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని మరోసారి స్పష్టమైందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. డీపీఆర్ తయారీ కోసం చేపట్టాల్సిన తవ్వకాల కంటే ఎక్కువమొత్తంలో అక్కడ పనులు జరిగాయని కేఆర్ఎంబీ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని గుర్తుచేసింది. కేంద్రం నివేదికపై తెలంగాణ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా పనులు నిర్వహిస్తున్నదని.. అనుమతిస్తే ఫొటోలు, వీడియోలతో సహా నిరూపిస్తామని వాదించింది. నిబంధనల మేరకే పనులను నిర్వహించామని, వాదనలను పూర్తిస్థాయిలో వినిపించేందుకు మరికొంత గడువు కావాలని ఏపీప్రభుత్వం కోరింది. వాదనలు విన్నాక సీమ ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కారు పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినట్టు స్పష్టమవుతున్నదని ఎన్జీటీ అభిప్రాయపడింది. తదుపరి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంటూ విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.