కురవి ;తొలి కాన్పులో పుట్టిన ఆడబిడ్డకు అపూర్వ స్వాగతం లభించింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లికి చెందిన చిర్విరాల కృష్టయ్య, సరోజిని దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు ప్రవీణ్ భార్య కల్పనకు తొలికాన్పులో ఆడబిడ్డ పుట్టడంతో ఆ ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. మనుమరాలిని ఇచ్చిన కోడలు కల్పనకు కనీవినీ ఎరుగని రీతిలో పూలు పరిచి ఘన స్వాగతం పలికారు. గత నెల 27న కల్పన పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆనవాయితీ ప్రకారం తొలికాన్పు సమయంలో తల్లిగారింటికి వెళ్లాల్సి ఉండగా తన కోడలిని, మనుమరాలిని బుధవారం రాత్రి ఇంటికి ఆహ్వానించిన సరోజ, కృష్టయ్య దంపతులు సంబురాలు చేసుకొన్నారు. శ్రావణమాసం ఇంటికి వచ్చే మహాలక్ష్మికి పూలజాతరను సిద్ధం చేశారు. మనుమరాలికి ఘన స్వాగతం పలికారు. దిష్టి తీసి, మనుమరాలి కాళ్లతో ఎర్రటి గుర్తులు వేసి, పూల పాన్పు పరిచారు.