హైదరాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): డైనింగ్ టేబుల్ భోజన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. మార్కెట్లలో విక్రయించే కూరగాయలు, మాంసం, చేపలు ఇతర ఏ పదార్థాలనైనా భూమికి రెండున్నర అడుగుల ఎత్తులో ఉంచి విక్రయించాలని, అప్పుడే భూమిపై ఉండే బ్యాక్టీరియా ఆహార పదార్థాలకు సోకదని చెప్పారు. ప్రతి రెండు లక్షల జనాభాకు ఒక సమీకృత మార్కెట్ను నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. శాసనసభలో ఆదివారం పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.
దేశంలో, రాష్ట్రంలో కూరగాయలు విక్రయించే పద్ధతి అనాగరికంగా, అశాస్త్రీయంగా ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. భూమిపై, మోరీల పక్కన కూరగాయలను విక్రయిస్తుండటం వల్ల వాటిపై బ్యాక్టీరియా సోకే అవకాశం ఉన్నదని చెప్పారు. దుమ్ము, ధూళి, ఒకరిపై ఒకరు పడే విధంగా గంజ్లో కూరగాయలు విక్రయించేవారని, ఈ మార్కెట్లలో భయంకరమైన పద్ధతులు ఉండేవని గుర్తుచేశారు. గతంలో ఎంత జనాభాకు ఎంత విస్తీర్ణంలో మార్కెట్ ఉండాలనే అవగాహన లేకుండా అశాస్త్రీయంగా, బాధ్యతారాహిత్యంగా మార్కెట్లను నిర్మించారని చెప్పారు. సుమారు 2 కోట్ల మంది జనాభా గల హైదరాబాద్లో కేవలం ఆరేడు మార్కెట్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం రెండు లక్షల మందికి ఒకటి చొప్పున నగరంలో 200 మార్కెట్లు అవసరమని వివరించారు.
డైనింగ్ టేబుల్ విధానం
ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ల ఏర్పాటు వెనుక ఉన్న ఆలోచనను సీఎం కేసీఆర్ వెల్లడించారు. డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ ఆధారంగానే వీటిని నిర్మిస్తున్నట్టు తెలిపారు. డైనింగ్ టైబుల్ పద్ధతిలో చేసే భోజనానికి, ఇంట్లో చేసే భోజన విధానానికి చాలా వ్యత్యాసం ఉన్నదని వివరించారు. ఇంగ్లిషు వాళ్లు శాస్త్రీయంగా డైనింగ్ టేబుల్ విధానాన్ని కనిపెట్టారని పేర్కొన్నారు. డైనింగ్ టేబుల్ విధానంలో భూమికి రెండున్నర అడుగుల పైన ప్లేట్ పెట్టుకొని భోజనం చేస్తామని, తద్వారా బ్యాక్టీరియా సోకకుండా ఉంటుందని చెప్పారు. దీంతో కాళ్లకు షూస్ లేదా చెప్పులు ధరించి భోజనం చేస్తున్నా.. ఇబ్బంది ఉండటం లేదని అన్నారు. ఇదే తరహాలో కూరగాయలు, మాంసం, చేపలను భూమికి రెండున్నర అడుగుల ఎత్తులో ఉంచి విక్రయించాలని చెప్పారు.
ఇలాంటి సంస్కారవంతమైన, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేవిధంగా అధునాతమైన మార్కెట్లను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. కనీసం రెండు లక్షల మందికి ఒక మార్కెట్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, వీటిని కచ్చితంగా పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే కలెక్టర్లందరికీ మోండా మార్కెట్ను చూపించినట్టు తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో సమీకృత మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ అద్భుతంగా మార్కెట్లను నిర్మించారని ప్రశంసించారు. చిన్న పిల్లలకు కూడా చిల్డ్రన్ కేజ్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
నకిలీ విత్తనాల బెడద లేకుండా చేస్తాం
ఏ రాష్ట్రంలో లేనివిధంగా నకిలీ విత్తనాల సరఫరాపై పీడీ యాక్ట్ పెట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలో నకిలీ విత్తనాల సమస్య అధికంగా ఉన్నదని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలపై పీడీ యాక్ట్ తీసుకొస్తామంటే కేంద్రం సతాయించినప్పటికీ, మంత్రి నిరంజన్రెడ్డి నాలుగైదుసార్లు ఢిల్లీ వెళ్లి, న్యాయశాఖను ఒప్పించి అనుమతి తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పటికే చాలామందిపై పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో నకిలీల బెడద లేకుండా చేస్తామని అభయమిచ్చారు.
వందేండ్ల క్రితమే సమీకృత మోండా మార్కెట్
సికింద్రాబాద్లో నిజాం కాలంలో వందేండ్ల క్రితం నిర్మించిన మోండా మార్కెట్ సమీకృత విధానంలో అద్భుతంగా ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. తాను ఆ మార్కెట్ను మొదటిసారి చూసినప్పుడు ఆశ్చర్యపోయానని తెలిపారు. అక్కడ విక్రయించే మాంసం, కూరగాయలు, చేపలు అన్నీ కూడా భూమికి రెండున్నర అడుగుల ఎత్తులో ఉంటాయని తెలిపారు. అక్కడ కొంచెం కూడా దుర్వాసన రాదని పేర్కొన్నారు. అప్పుడు ఏర్పాటు చేసినా జాలిలే ఇంకా ఉన్నాయని పేర్కొన్నారు.