హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): చారిత్రక వారసత్వ సంపదకు నెలవైన యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో శాసనం లభించింది. చౌటుప్పల్ మండలంలోని పెదకొండూరు వరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో కాకతీయుల శాసనాన్ని గుర్తించారు. మల్లు బాలమ్మ దాన శాసనాన్ని కొత్త తెలంగాణ చిత్ర బృంద సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, డాక్టర్ మండల స్వామి కనుగొన్నారు.
ఈ శాసనాన్ని గుర్తించడంలో గ్రామ సర్పంచ్ కాయితి రమేశ్గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు బద్దం కొండల్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ జక్కిడి కొండల్రెడ్డి, గుండెబోయిన ఇస్తారియాదవ్, పాలకూరు వెంకటేశ్గౌడ్ సహకరించారు. 13, 14 శతాబ్దాలకు చెందిన ఈ శాసనం 112 పంక్తులతో తెలుగులో ఉన్నట్టు గుర్తించారు.